దుమారం: మాజీ తీవ్రవాది ఇంట్లో రాత్రి బస చేసిన కేజ్రీవాల్!
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శనివారం రాత్రి మాజీ తీవ్రవాది ఇంట్లో బస చేశారనే వార్త తీవ్ర దుమారం రేపుతోంది.
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శనివారం రాత్రి మాజీ తీవ్రవాది ఇంట్లో బస చేశారనే వార్త తీవ్ర దుమారం రేపుతోంది. పంజాబ్లోని జిగ్రాలో ప్రచారం చేశాక ఆయన మోగాలో శనివారం రాత్రి ఖలిస్థాన్ మాజీ తీవ్రవాది గురీందర్సింగ్ ఇంటికి రహస్యంగా వెళ్లారు. దీంతో పంజాబ్లోని ప్రత్యర్థి పార్టీల నేతలు కేజ్రీవాల్పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
జిరా ప్రాంతంలో శనివారం ర్యాలీ ముగిసిన తర్వాత ఆ రోజు రాత్రి పది గంటలకు మోగా చేరుకున్నారు. రాత్రి గురీందర్ ఇంట్లో బస చేశారట. ఈ విషయం ఆప్ మోగా అభ్యర్థికి కూడా తెలియదట. అయితే ప్రస్తుతం గురీందర్ ఆ ఇంట్లో ఉండడం లేదు. ఆయన ఆర్నెల్లుగా ఇంగ్లాండ్లో ఉంటున్నారు.
గురీందర్ సింగ్ స్నేహితుడు, కెనడాకు చెందిన సత్నం సింగ్ శనివారం రాత్రి కేజ్రీవాల్ను రిసీవ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కేజ్రీవాల్ రాత్రి అక్కడే ఉండి ఆదివారం ఉదయం పది గంటల సమయంలో అమృత్సర్కు వెళ్లినట్లు సమాచారం. అయితే ఆప్ పంజాబ్ వ్యవహారాల ఇన్ఛార్జి సంజయ్ సింగ్ మాత్రం కేజ్రీవాల్ మాజీ మిలిటెంట్ ఇంట్లో బస చేశారనే విషయాన్ని ఖండించారు.
గురీందర్ సింగ్ గతంలో ఖలిస్థాన్ కమెండో ఫోర్స్ చీఫ్గా క్రియాశీలంగా ఉండేవారు. 1997లో బాఘపురానాలో హత్య, తదితర నేరాల కింద కేసు నమోదైంది. అయితే ఈ కేసులో గురీందర్ నిర్దోషిగా విడుదలయ్యారు. మూడేళ్ల క్రితం ఆయన మోగాలో ఇల్లు కొన్నారు. ఇంగ్లండ్ వెళ్లకముందు ఆ ఇంట్లోనే ఉండేవారు.
కాగా, అధికారం కోసం కేజ్రీవాల్ ఎం తకైనా తెగిస్తారని ఈ ఘటన నిదర్శన మని శిరోమణి అకాలీదళ్ అధినేతసుఖ్ బీర్ సింగ్ బాదల్ విమర్శించారు. తీవ్రవాదులు, మితవాదులతో కుమ్మక్కైన పార్టీ ఆప్ అని పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ అన్నారు.
, అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలువదన్న వార్తలు జర్నలిస్టులు డబ్బులు తీసుకుని రాసిన వాస్తవ విరుద్ధమైన వార్తలని కేజ్రీవాల్ ట్విట్టర్లో మండిపడ్డారు. ఇతర పార్టీలు డబ్బులిస్తే తీసుకుని తమ పార్టీకే ఓటు వేయాలని ఓటర్లకు పిలుపు ఇచ్చిన తనపై ఆగమేఘాల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఈసీ.. ఇతర పార్టీల నేతలపై కూడా కేసు పెట్టాలని ఆయన కోరారు.
ఇది ఇలా ఉండగా, కేంద్ర అరుణ్జైట్లీ వేసిన పరువునష్టం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందేనని ఢిల్లీ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సుమిత్ దాస్ ఆదేశించారు. మార్చి 25న జరిగే ఈ కేసు తదుపరి విచారణకు కేజ్రీవాల్తో సహా జైట్లీపై ఆరోపణలు చేసిన ఇతర ఆప్ నేతలు హాజరుకావాలన్నారు.