కాంగ్రెస్లో చేరిన ఆప్ నేత.. కేజ్రీవాల్ రూ.10కోట్లు డిమాండ్ చేశారని ఆరోపణలు..
ఢిల్లీలోని ద్వారక సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదర్శ్ శాస్త్రికి ఆమ్ ఆద్మీ పార్టీ టికెట్ నిరాకరించడంతో ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరిన శాస్త్రి.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి,ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్పై పలు ఆరోపణలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చేందుకు కేజ్రీవాల్ రూ.10కోట్లు డిమాండ్ చేసినట్టు ఆరోపించారు. పార్టీ టికెట్లను రూ.10కోట్లు నుంచి రూ.20కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలకు కేజ్రీవాల్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదని, నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టంపై అభిప్రాయమని చెప్పమని కోరగా.. ఆయన ముందుకు రాలేదన్నారు.
కాగా, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన ఆమ్ ఆద్మీ.. ఆదర్శ్ శాస్త్రికి బదులు ద్వారకలో వినయ్ మిశ్రాకు టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్లో చేరిన ఆదర్శ్ శాస్త్రికి.. ఆ పార్టీ ద్వారక టికెట్ ఇచ్చింది. దీంతో ద్వారక సిట్టింగ్ స్థానాన్ని ఆదర్శ్ శాస్త్రి నిలబెట్టుకుంటారా.. లేక వినయ్ మిశ్రాకు ఓటర్లు పట్టం కడుతారా అన్న ఆసక్తి నెలకొంది. ఆమ్ ఆద్మీ జాతీయ ప్రతినిధిగా,పార్టీ విదేశీ వ్యవహారాల కో-కన్వీర్గా పనిచేసిన ఆదర్శ్ శాస్త్రి.. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనవడు కావడం గమనార్హం. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుభాష్ చోప్రా, పిసి చాకో, ముఖేష్ శర్మ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.
గత లోక్సభ ఎన్నికల సమయంలోనూ ఆమ్ ఆద్మీ లోక్సభ అభ్యర్థి బల్బీర్ సింగ్ జక్తార్ తనయుడు కేజ్రీవాల్పై ఆరోపణలు చేశారు. తన తండ్రికి ఎంపీ టికెట్ ఇచ్చేందుకు రూ.6కోట్లు డిమాండ్ చేశారని ఆరోపించారు. అయితే ఆప్ యాజమాన్యం మాత్రం ఆ ఆరోపణలను ఖండించింది.