మోడీ అపాయిమెంట్మెంట్ అడిగిన కేజ్రీ, అంతర్జాతీయ మీడియా ఇలా..
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అపాయింటుమెంటును ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ఈ నెల 14వ తేదీన కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో తన ప్రమాణ స్వీకారానికి హాజరుకావాల్సిందిగా కోరేందుకు మోడీ అపాయింటుమెంట్ కోరారు.
ఢిల్లీ ఓటమిపై అమిత్ షా మౌనం
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఢిల్లీ ఓటమి పైన మౌనందాల్చారు. మంగళవారం నాడు ఆయన కుమారుడు జయ్ వివాహ వేడుకలో పలువురు కేంద్రమంత్రులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం నేపథ్యంలో పెళ్లికి హాజరైన నేతల్లో నైరాశ్యం కనిపించింది. దీనిపై అమిత్ షా స్పందనకు విలేకరులు ప్రయత్నించారు. కానీ, ఆయన కారు దిగకుండానే వెళ్లారు.
అంతర్జాతీయ మీడియా ప్రశంస
ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం పట్ల అంతర్జాతీయ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. బీజేపీపై ఏఏపీ అనూహ్య విజయం సాధించిందని పత్రికలు పేర్కొన్నాయి. ఏఏపీ రాజకీయ భూకంపం అంటూ కితాబిచ్చారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని అధికార పార్టీ ఢిల్లీలో ఓ చిన్న రాజకీయ పార్టీ చేతిలో దారుణ ఓటమి చవి చూసిందని న్యూయార్క్ టైమ్స్ రాసింది.
బీజేపీది అనూహ్య ఓటమిగా వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. సీఎన్ఎన్ పత్రిక.. పైకి వెళ్లిందేదైనా.. కిందికి రావాల్సిందే నంటూ న్యూటన్ భౌతిక శాస్త్ర నియమంతో పోల్చింది. ప్రధాని మోడీకి ఢిల్లీ పరాజయం తొలి ఎదురుదెబ్బగా బీబీసీ వర్ణించింది. బీజేపీ, కాంగ్రెస్లకు ఈ ఓటమి అవమానకరమని లండన్కు చెందిన ది టెలిగ్రాఫ్ పేర్కొంది.
15మందికి 40 వేల ఓట్లకు పైగా మెజారిటీ
చీపురు సునామీ ప్రత్యర్థి పార్టీలను నామరూపాల్లేకుండా చేసిన విషయం తెలిసిందే. అత్యధిక మెజారిటీలతో ఘన విజయం సాధించిన ఏఏపీ చరిత్ర సృష్టించింది. గెలిచిన 67మందిలో 50 మంది 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.
వారిలో 15మంది 40 వేలకు పైగా మెజారిటీ సాధించి చరిత్ర సృష్టించారు. ఇంతటి భారీ మెజారిటీలు సాధించడం ఢిల్లీ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించిన అభ్యర్థిగా వికాస్నగర్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన మహేందర్ యాదవ్ రికార్డు సృష్టించారు.
ఆయన తన బీజేపీ ప్రత్యర్థిపై 77,665 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. కాగా ఓడిన మూడు సీట్లలోనూ ఆప్ తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోవడం గమనార్హం. ఒక చోట ఐదు వేలు, మరోచోట 10 వేల ఓట్ల వ్యత్యాసంతో ఆప్ అభ్యర్థులు ఓడిపోయారు. మరో స్థానంలో మాత్రం మూడో స్థానంలో నిలిచారు.