"కేజ్రీవాల్ అసలా మాటే అనలేదు"
న్యూఢిల్లీ : పాక్ పై భారత్ చేసిన సర్జికల్ దాడులకు ఆధారాలు చూపాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి. అటు మీడియాలోను ఇటు జనంలోను ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే క్రమంలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా కేజ్రీపై ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే.
కాగా, కేజ్రీవాల్ అసలు అలాంటి వ్యాఖ్యలే చేయలేదని చెబుతోంది ఆమ్ ఆద్మీ పార్టీ. తాజాగా ఈ వివాదంపై స్పందించిన ఢిల్లీ మంత్రి మనీష్ సిసోడియా కేజ్రీపై వస్తోన్న ఆరోపణలను ఖండించారు. గోవాలో మీడియాతో మాట్లాడిన సందర్బంగా.. ఈ విషయాన్ని ప్రస్తావించిన సిసోడియా 'ఆధారాలు' అన్న పదం అసలు కేజ్రీవాల్ ఉపయోగించలేదని తెలిపారు.
అంతేకాదు సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో ప్రధాని మోడీని అభినందిస్తూ ఓ వీడియో సందేశాన్ని కూడా కేజ్రీవాల్ విడుదల చేశారని చెప్పారు. దేశ భద్రత కోసం ప్రాణాలకు తెగించిన పోరాడిన సైనికులను ఈ సందర్బంగా ఆయన కొనియాడారు. ఇండియన్ ఆర్మీ ఎంతో ధైర్యంగా పాక్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిందని చెప్పుకొచ్చారు.