కేజ్రీవాల్ హామీలు: మహిళలకు నెలకు రూ.వెయ్యి, కాంగ్రెస్ విమర్శతో ఆత్మపరిశీలన.. తప్పుగా మాట్లాడనా...
పంజాబ్ ఎన్నికల వేళ అటాక్ కౌంటర్ అటాక్ జరుగుతోంది. వాస్తవానికి ఎన్నికలు వచ్చే ఏడాది జరుగుతాయి. కానీ ఇప్పటినుంచే నేతలు మాటల యుద్దానికి దిగుతున్నారు. సిద్దూ వర్సెస్ కేజ్రీవాల్ మధ్య అటాక్ పీక్ స్టేజీకి చేరింది. ఇవాళ పంజాబ్లో కేజ్రీవాల్ పర్యటించారు. ఈ క్రమంలో ఎన్నికల నేపథ్యంలో హామీలు ఇచ్చారు. ప్రధానంగా మహిళలను ప్రస్తావించారు.
నెలకు రూ.వెయ్యి
పంజాబ్లో అధికారంలోకి వస్తే రాష్ట్రంలో 18 ఏండ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1000 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ఇటీవల కేజ్రివాల్ ప్రకటించారు. దీనిపై పంజాబ్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్.. ఇవాళ జలంధర్లో ఓ సభలో మాట్లాడుతూ.. పంజాబ్ కాంగ్రెస్ నేతల పేర్లు ప్రస్తావించకుండానే కౌంటర్ ఇచ్చారు.
తప్పు చేశానా.. ఏందీ
18 ఏండ్లు నిండిన ప్రతి మహిళకు రూ.1000 ఆర్థిక సాయం అందిస్తామని ఇటీవల ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ ప్రకటన చేసినప్పటి నుంచి పంజాబ్ కాంగ్రెస్ నేతలు తనకు శాపనార్థాలు పెడుతున్నారు. నేను వాళ్లని ఒక్కటే అడుగుతున్నా. మహిళలకు నెలకు రూ.1000 ఇవ్వమంటున్నారా వద్దంటున్నారా..?' అని కేజ్రివాల్ ప్రశ్నించారు. వాళ్ల శాపనార్థాలు వింటుంటే, తనకే తానేమైనా తప్పుచేశానా..? అనే సందేహం కలుగుతున్నదని ఆశ్చర్యం వ్యక్తంచేశారు.
డైలాగ్ వార్
వచ్చే ఏడాది ప్రారంభంలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారంలో చేపట్టాలని ఆప్ భావిస్తోంది. ఆప్ అధినేత కేజ్రీవాల్ వరసగా పంజాబ్ పర్యటనలు చేస్తూ అక్కడి పార్టీ కేడర్లో జోష్ నింపుతున్నారు. పంజాబ్ ఓటర్లను ఆకట్టుకునేలా ముందుకు సాగుతున్నారు. అయితే కేజ్రీవాల్ బలపడితే తమకు నష్టం తప్పదని భావిస్తున్న కాంగ్రెస్.. రాష్ట్రంలో అధికారాన్ని ఎట్టిపరిస్థితుల్లో నిలబెట్టుకోవాలని అనుకుంటుంది. ఆమ్ ఆద్మీ వైపుకి ఓటర్లు మళ్లకుండా చూసే ప్రయత్నాలను కొనసాగిస్తుంది. ఇందులో భాగంగా ఢిల్లీ సీఎం నివాసం వద్ద ఢిల్లీ గెస్ట్ టీచర్లు చేసిన నిరసనలో సిద్ధూ పాల్గొన్నారు. తర్వాత కేజ్రీవాల్ వర్సెస్ సిద్దూ మధ్య మాటల యుద్దం తీవ్ర స్థాయికి చేరింది.