పరువునష్టం: తగ్గని కేజ్రివాల్పై అభియోగాలు నమోదు
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పెట్టిన పరువునష్టం కేసులో శుక్రవారం ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్పై అభియోగాలు నమోదయ్యాయి. 499, 500 సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసిన న్యాయస్థానం, వ్యక్తిగత హాజరు నుంచి ఆయనకు మినహాయింపు ఇచ్చింది.
ఆగస్టు 2 నుంచి ఈ కేసును విచారించనుంది. కేజ్రివాల్పై న్యాయస్థానం నమోదు చేసిన అభియోగాలు రుజువైతే.. అతనికి గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అంతకుముందు న్యాయస్థానం అరవింద్ కేజ్రివాల్కు ఓ సూచన చేసింది.
ఇద్దరూ రాజకీయ నాయకులు కాబట్టి పరస్పరం చర్చించుకుని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించింది. ఇద్దరు నేతలు తమ విలువైన సమయాన్ని మరింత ఉపయోగకరమైన విధంగా వినియోగించి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని పేర్కొంది. అయితే అరవింద్ కేజ్రివాల్ మాత్రం అందుకు అంగీకరించలేదు.
తాను చేసిన ఆరోపణలను ఉపసంహరించుకోనని తేల్చి చెప్పాడు. దీంతో కేజ్రివాల్పై అభియోగాలు నమోదు చేసింది. కాగా, అరవింద్ కేజ్రివాల్ తనకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదనీ.. తనపై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకుంటే చాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
ఇది ఇలా ఉండగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణపై సుప్రీం కోర్టు స్టేను పొడిగించింది. జయలలిత కేసు విచారణపై స్టేను జూన్ 16 వరకు పొడిగిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.