ముఖ్యమంత్రిపై 100 మందిపై కర్రలతో దాడికి యత్నం, బీజేపీ కార్యకర్తలేనని..
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పైన గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం నాడు దాడికి పాల్పడ్డారు. నారెల ప్రాంతంలో కర్రలతో సమూహంగా వచ్చిన వారు దాడి చేశారు. దాడికి పాల్పడ్డ వారి చేతిలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జెండాలు ఉన్నాయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
దాదాపు వందమంది కర్రలు చేతబట్టుకొని వచ్చి కేజ్రీవాల్ కారును అడ్డగించారు. ఢిల్లీ ఔట్స్కర్ట్లలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు ముఖ్యమంత్రి వెళ్లారు. ఈ సమయంలో వారు జెండాలు, కర్రలు చేత పట్టుకొని వచ్చారు.
బీజేపీ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఈ సందర్భంగా చెప్పారు. కారు రేర్ వ్యూ మిర్రర్ పగిలిపోయినట్లు తెలిపారు. కేజ్రీవాల్ను భద్రతా సిబ్బంది కాపాడిందని తెలిపారు. ఇది ఢిల్లీ పోలీసుల వైఫల్యమని ఆమ్ ఆద్మీ పార్టీ నిప్పులు చెరిగింది. గత ఏడాది నవంబర్ నెలలో గుర్తు తెలియని వ్యక్తులు సీఎం ఆఫీస్కు వచ్చి చిల్లీ పౌడర్తో దాడికి ప్రయత్నాలు చేశారు.