మోసపోయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె... పోలీసులకు ఫిర్యాదు...
ఇటీవలి కాలంలో ఆన్లైన్ మోసాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం కొన్నిసార్లు కేటుగాళ్ల మోసాలకు బలవుతున్నారు. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె హర్షిత కూడా ఓ సైబర్ నేరగాడి చేతిలో మోసపోయారు.
వివరాల్లోకి వెళ్తే... ప్రముఖ ఈకామర్స్ వెబ్సైట్ ఓఎల్ఎక్స్లో ఇటీవల హర్షిత సెకండ్ హ్యాండ్ సోఫాను అమ్మకానికి పెట్టారు. ఆ ప్రకటనపై స్పందించిన ఓ వ్యక్తి సోఫాను కొనేందుకు ముందుకొచ్చాడు. సోఫా ధర రూ.34వేలు కాగా.. మొదట కొద్దిపాటి మొత్తాన్ని ఆమె ఖాతాకు ట్రాన్స్ఫర్ చేశాడు. ఖాతా వివరాలు సరిగా ఉన్నాయో లేవో చెక్ చేద్దామని మొదట ఇలా కొద్ది మొత్తాన్నే పంపించినట్లు హర్షితతో చెప్పాడు.
ఆ తర్వాత ఆమె సెల్ఫోన్కు ఒక క్యూఆర్ కోడ్ను పంపించిన అతను... దాన్ని స్కాన్ చేస్తే రూ.20వేలు మీ ఖాతాకు క్రెడిట్ అవుతాయని హర్షితతో చెప్పాడు. నమ్మేసిన హర్షిత అతను చెప్పినట్లే చేసింది. అయితే క్రెడిట్కు బదులు ఆమె ఖాతా నుంచే రూ.20వేలు డెబిట్ అయ్యాయి. ఇదేంటని ఫోన్ ద్వారా అతన్ని ప్రశ్నిస్తే... అయ్యో తప్పు జరిగిపోయింది... ఈసారి సరైన క్యూఆర్ కోడ్ పంపిస్తానని చెప్పాడు. రెండోసారి పంపించిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయగానే హర్షిత ఖాతా నుంచి మరో రూ.14వేలు డెబిట్ అయ్యాయి. దీంతో షాక్ తిన్న హర్షిత అతనికి ఫోన్ చేయగా అటువైపు నుంచి ఎటువంటి బదులు లేదు. దీంతో మోసపోయానని గ్రహించి ఆమె పోలీసులను ఆశ్రయించారు.
హర్షిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సివిల్ లైన్స్ పబ్లిక్ స్టేషన్ పోలీసులు వెల్లడించారు.
కాగా,దేశవ్యాప్తంగా ఇలాంటి నేరాలు చాలావరకు పెరిగిపోయాయి. గతేడాది సెప్టెంబర్లోనూ ఢిల్లీలో ఇలాంటి తరహా మోసాలే వెలుగుచూశాయి. జాబ్ పేరుతో,శానిటైజర్ విక్రయాల పేరుతో,సెకండ్ హ్యాండ్ కెమెరాను విక్రయించే పేరుతో కొంతమంది సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడ్డారు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో మరో రకం మోసాలు కూడా వెలుగుచూస్తున్నాయి. సోషల్ మీడియాలో ఉన్న ప్రొఫైల్స్కు ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి కొంతమంది సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఆ ఫేక్ ప్రొఫైల్ నుంచి ఒరిజినల్ ప్రొఫైల్లోని ఫ్రెండ్ లిస్టులో ఉన్నవారికి డబ్బులు కావాలని మెసేజ్లు పెట్టడం... నిజంగా తమ మిత్రుడే అడుగుతున్నాడని సదరు వ్యక్తులు డబ్బులు పంపించడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.