నీ కూతుర్ని కిడ్నాప్ చేస్తాం, కాపాడుకునేందుకు ఏమైనా చేసుకో: కేజ్రీవాల్ ఆఫీస్కు బెదిరింపు మెయిల్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూతురుకు సెక్యూరిటీని కల్పించారు. ఈ మెయిల్ ద్వారా ఆమెను కిడ్నాప్ చేస్తామని బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆమెకు భద్రతను పెంచారు.
అరవింద్ కేజ్రీవాల్ కూతురును అపహరిస్తామని ఈ మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయని అధికారులు శనివారం తెలిపారు. జనవరి తొమ్మిదో తేదీన ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చిన ఈ ఈ మెయిల్ గురించి ఢిల్లీ పోలీస్ కమిషనరు అమూల్య పట్నాయక్కు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.
వెంటనే స్పందించిన అమూల్య పట్నాయక్.. కేజ్రీవాల్ కూతురు రక్షణకు ప్రత్యేకంగా ఓ పోలీసు అధికారిని నియమించారని చెప్పారు. ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలని సైబర్ సెల్ పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు.
'మీ కూతురును కిడ్నాప్ చేస్తాం. ఆమెను కాపాడుకునేందుకు ఏం చేస్తావో చేసుకో' అని ఆ బెదిరింపు ఈ మెయిల్లో ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. దీనిపై సైబర్ సెల్ అధికారులు విచారణ జరుపుతున్నారు.
కేజ్రీవాల్ సతీమణి సునితా. వీరికి ఇద్దరు పిల్లలు. హర్షిత కేజ్రీవాల్ పెద్ద అమ్మాయి. పులకిత్ అబ్బాయి. సాధారణంగా కేజ్రీవాల్ కుటుంబ సభ్యులు రాజకీయాలకు, అన్నింటికి దూరంగా ఉంటారు. 2014లో హర్షిత కేజ్రీవాల్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఎంట్రెన్స్ టెస్ట్లో పాసైనప్పుడు ఆమె పేరు మీడియాలోకి వచ్చింది. ఇక్కడి నుంచి ఆమె ఇంజినీరింగ్ చేశారు.