కేజ్రివాల్: ఆ సామాన్యుడి కరెంట్ బిల్లు ఇంతా?
న్యూఢిల్లీ: మాది సామాన్యుల పార్టీ అని న్యూఢిల్లీలో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత, సిఎం అరవింద్ కేజ్రివాల్ ఇంటి కరెంటు బిల్లు మాత్రం సామాన్యంగా లేదు. దీంతో ప్రతిపక్షాలు కేజ్రివాల్పై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి.
సివిల్ లైన్స్ రెసిడెన్స్ ప్రాంతంలో ఉన్న కేజ్రివాల్ ఇంటి ఏప్రిల్, మే నెలల కరెంటు బిల్లు 91,000 రూపాయలు వచ్చింది. వివేక్ గరగ్ అనే అడ్వకేట్ సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నాడు.
అయితే అది అబద్ధమని, నిజానికి ఈ రెండు నెలలకు గాను కేజ్రివాల్ ఇంటి కరెంటు బిల్లు 1,03,000 రూపాయలని భారతీయ జనతా పార్టీ నేతలు వాదిస్తున్నారు. ఆప్ మంత్రుల బిల్లులు కూడా తక్కువేం కాదని, త్వరలోనే వాటినీ బయటపెడతామని వారు తెలిపారు.
హైకోర్టులో కేజ్రీ సర్కార్కు చుక్కెదురు
ఢిల్లీ అవినీతి నిరోధకశాఖ (ఏసిబి) చీఫ్గా ఎంకే మీనా నియామకాన్ని నిలిపేయాలని కేజ్రీవాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. మీనా ఏసీబీ ప్రధాన కార్యాలయంలోకి వెళ్లేందుకు అడ్డంకులు సృష్టించవద్దని జస్టిస్ వీపీ వైష్ నేతృత్వంలోని హైకోర్టు బెంచ్ సోమవారం ఢిల్లీ సర్కార్ను ఆదేశించింది.
చట్ట ప్రకారం వ్యవహరించాలని మీనాకు కూడా సూచించింది. కేసు తదుపరి విచారణను ఆగస్టు 11కు వాయిదా వేసింది. మీనా ఏసీబీలోని ఇతర అధికారులను బెదిరిస్తున్నారని, అవినీతి కేసులను ఢిల్లీ పోలీసులకు బదిలీచేయాలని ఆదేశాలిస్తున్నారని, అవినీతి పరుల పట్ల మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారని, ఆయన నియామకాన్ని ఆపేయాలని ఆప్ సర్కార్ తరపు న్యాయవాది ఇందిరాజైసింగ్ చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.