కాలుష్య రహిత రాష్ట్రం కోసం: ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని ప్రారంభించిన ఢిల్లీ సీఎం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు. ఈ పాలసీని ప్రారంభించడంతో అన్ని రంగాల దిగ్గజ పారిశ్రామికవేత్తలు సీఎం తీసుకున్న ఈ చొరవపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఢిల్లీ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ఈ పథకంను ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించింది. అంతేకాదు కాలుష్యంను నియంత్రించడం, రవాణా రంగంలో ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని సీఎం కేజ్రీవాల్ ప్రారంభించారు. ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీలాంటి ఒక బృహత్తర కార్యక్రమం లేదా పథకం దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు దేశంలో విద్యుత్ ఎకానమీ కూడా పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఢిల్లీలోని ఆప్ సర్కార్ ప్రారంభించిన ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని పలువురు దిగ్గజ పారిశ్రామిక వేత్తలు ప్రశంసించారు. మహీంద్ర ఎలక్ట్రిక్ సంస్థ సీఈఓ మరియు హీరో ఎలక్ట్రిక్ ఎండీ నవీన్ ముంజల్లు ట్విటర్ ద్వారా ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఢిల్లీ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని ప్రవేశపెట్టడం స్వాగతించ దగ్గ విషయమని, ఈ విషయంలో ప్రభుత్వానికి తమ పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని వెల్లడించారు. ఈ పథకం అమలులో తమ సహకారం తప్పకుండా ఉంటుందని వెల్లడించారు.
భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడే ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని ప్రారంభించిన ఢిల్లీ ప్రభుత్వానికి సీఎం కేజ్రీవాల్కు కృతజ్ఞతలంటూ మహీంద్ర ఎలక్ట్రిక్ సీఈఓ మహేష్ బాబు ట్వీట్ చేశారు. తమ సంస్థ తప్పకుండా ఈ పాలసీ అమలుకు సహకరిస్తుందంటూ ట్వీట్ చేశారు.
My compliments and thanks to Delhi Govt. And @ArvindKejriwal for Delhi announcing a long term futuristic Electric vehicle policy. Mahindra will work jointly to transform the mobility to sustainable in Delhi. https://t.co/DMSg4wSeb9
— Mahesh Babu (@Maheshsbabu) August 7, 2020
కాలుష్య రహిత దేశంగా భారత్ అవతరించనుందని ఇందుకు సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం ముందడుగు వేసిందని వెల్లడించారు హీరో ఎలక్ట్రిక్ ఎండీ నవీన్ ముంజల్. తమ సహకారం తప్పకుండా ఉంటుందని వెల్లడించారు.
@Hero_Electric welcomes the latest Electric Vehicle Policy by @CMODelhi @ArvindKejriwal. This is a great move towards a pollution-free nation.
— Naveen Munjal (@nmunjal) August 7, 2020
Recommended Video
అంతకుముందు ఓ ప్రెస్మీట్లో మాట్లాడిన సీఎం కేజ్రీవాల్... ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ రెండు విధాలుగా ఉపయోగపడుతుందని చెప్పారు. కరోనావైరస్ కారణంగా గాడి తప్పిన ఢిల్లీ ఆర్థిక వ్యవస్థను తిరిగి ట్రాక్లోకి పెట్టడమే కాకుండా.. విద్యుత్ రంగాన్ని ఆర్థికంగా పరిపుష్టి చేస్తుందని అన్నారు. అంతేకాదు నిరుద్యోగులకు రవాణారంగంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పారు.ఇక ఈ పాలసీతో ఢిల్లీ కాలుష్య రహిత నగరంగా రూపాంతరం చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లుగా ఢిల్లీ ప్రజలు కలిసి కట్టుగా పనిచేసి 25శాతం మేరా కాలుష్య స్థాయిని తగ్గించడంలో సహకరించారని పేర్కొన్న కేజ్రీవాల్... కొత్తగా తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీతో మరింతగా కాలుష్యం తగ్గుతుందని చెప్పారు. కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీతో భారత ఈవీ క్యాపిటల్గా ఢిల్లీని తయారు చేయడంతో పాటు.. ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగంలో ఢిల్లీని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాలనే లక్ష్యంతో పనిచేస్తామని చెప్పారు.