ప్రాణాలతో బయటపడ్డాడు: కేజ్రీవాల్ కారుపై కర్రలు, రాళ్లతో దాడి
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్పై గుర్తు తెలియన్ కొందరు వ్యక్తులు దాడి చేశారు. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ప్రచార నిమిత్తం లూధియానా జిల్లా పర్యటన నిమిత్తం ఈ దాడి చోటు చేసుకుంది. కర్రలు, రాళ్లు చేతబట్టిన గుర్తు తెలియని దుండగులు కేజ్రీ కారుపై విరుచుకుపడ్డారు.
పెద్ద పెద్ద రాళ్లు పడటంతో కేజ్రీవాల్ కారు ముందు అద్దాలు పగిలిపోయాయి. అయితే కేజ్రీవాల్కు మాత్రం ఎలాంటి గాయాలు కాలేదు. దాడి జరిగిన తీరును స్వయంగా కేజ్రీవాల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.
'లూధియానాలో నా కారుపై కర్రలు, రాళ్లతో దాడి జరిగింది. కారు ముందు గ్లాస్ పేన్ పగిలిపోయింది. నా పర్యటనపై బాదల్ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ అసహనంతో ఉన్నాయి. అయితే, ఎన్ని దాడులు చేసిన నా ఆశయాన్ని మాత్రం భగ్నం చేయలేవు' అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఇక ఆప్ నేత ఆశిష్ ఖేతన్ కూడా వెనువెంటనే స్పందించారు.
'కేజ్రీవాల్ను తీవ్రంగా గాయపరిచేందుకు కొంతమంది దుండగులు కారుకు అతి సమీపానికి వచ్చారు. అయితే దేవుడి దయ వల్ల కేజ్రీవాల్కు ఎలాంటి గాయాలు కాలేదు' అని ఖేతన్ పేర్కొన్నారు. ఇటీవలే పంజాబ్ ఎన్నికల్లో భాగంగా కేజ్రీవాల్కు ముప్పు ఉందంటూ ఢిల్లీ పోలీసులు... పంజాబ్ పోలీసులను అప్రమత్తం చేసింది.
అయితే అలా అప్రమత్తం చేసిన నాలుగు రోజుల్లోనే ఈ దాడి ఘటన జరగడం గమనార్హం.
My car attacked with sticks and stones in Ludhiana. Front glass pane broken. Badals n congress nervous? They can't break my spirits
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 29, 2016
మరోవైపు భారత ప్రధాని నరేంద్రమోడీ కన్నా తానే పెద్ద దేశ భక్తుడినని దేశద్రోహం అభియోగాలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. 'దేశద్రోహం అభియోగాలతో నాపై కేసు పెట్టారు. దళితులు, వెనుకబడిన తరగతులు, పేదల కోసం నేను గళమెత్తుతున్నాను. అందుకే (బీజేపీ) వాళ్లకు నేను దేశద్రోహిలాగా కనిపిస్తున్నాను. అయినా నా గొంతును ఎవ్వరూ అణచివేయలేరు. వారి కోసం నేను నా పోరాటాన్ని కొనసాగిస్తాను' అని కేజ్రీవాల్ సోమవారం ట్విట్టర్ లో పేర్కొన్నారు.
'మోడీజీ కన్నా నేనే పెద్ద దేశభక్తుణ్ని. దేశాన్ని నాశనం చేస్తామంటూ నినాదాలు చేసిన వారిని ఎందుకు ఇంకా అరెస్టు చేయలేదని నేను ప్రశ్నించాను. ఎందుకంటే ఆ నినాదాలు చేసిన కశ్మీరీలు. వారిని అరెస్టుచేస్తే మెహబూబా ముఫ్తీకి కోపం వస్తుంది. అందుకే అరెస్టు చేయడం లేదు. సరిహద్దుల్లో ప్రతిరోజూ సైనికులు అమరులవుతున్నారు. మోదీ మాత్రం కశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటు కోసం దేశద్రోహులను కాపాడాలని చూస్తున్నారు' అని కేజ్రీవాల్ ట్విట్టర్లో ధ్వజమెత్తారు.