ఢిల్లీవాసులకు కేజ్రీవాల్ వరం.. 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్
ఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీవాసులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ప్రకటించారు. గురువారం నుంచే ఈ పథకం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. అంతేకాదు.. 201 నుంచి 400 యూనిట్ల వరకు కరెంటు ఉపయోగించేవారికి ప్రభుత్వం నుంచి 50శాతం సబ్సిడీ అందుతుందని చెప్పారు.
దేశంలో అత్యంత చౌకైన విద్యుత్ ఢిల్లీలోనే లభిస్తోందని సీఎం కేజ్రీవాల్ అన్నారు. ఇది చారిత్రక నిర్ణయమని చెప్పారు. ఆమ్ ఆద్మీకి ఇది ఎంతో ఉపయోగపడుతుందన్న ఆయన.. ఈ స్కీమ్కు ఫ్రీ లైఫ్ లైన్ ఎలక్ట్రిసిటీ స్కీమ్ అని పేరు పెట్టారు. వీఐపీలు, బడా రాజకీయ నాయకులకు ఉచిత కరెంటు ఇచ్చినప్పుడు సాధారణ పౌరులకు ఉచితంగా కరెంటు అందిస్తే తప్పేంటని కేజ్రీవాల్ ప్రశ్నించారు.
కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయం వల్ల ఢిల్లీలో 33శాతం మందిప్రజలు ప్రయోజనం పొందనున్నారు. వేసవిలో కూడా వీరి విద్యుత్ వినియోగం 200 యూనిట్లకు మించట్లేదని చెప్పారు. చనికాలంలో అయితే ఢిల్లీలో 70శాతం మంది ప్రజలు 200యూనిట్ల కన్నా తక్కువ విద్యుత్ వాడతారని చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేశఆరు. ఇప్పటి వరకు 200యూనిట్ల విద్యుత్ వినియోగానికి జనం రూ.622 బిల్లు చెల్లించాల్సి వచ్చేది. ప్రస్తుతం ఫ్రీ లైఫ్ లైన్ ఎలక్ట్రిసిటీ స్కీం అందుబాటులోకి రావడంతో ఆ భారం తగ్గనుంది.