దేశరాజకీయాల్లో కేజ్రీవాల్ సత్తా చాటుతారా..? లోక్సభలో విపక్ష పార్టీనేతగా ఆప్ చీఫ్ను స్వాగతిస్తారా..
ఢిల్లీ: జాతీయ రాజకీయాల్లోకి అరవింద్ కేజ్రీవాల్కు సమయం ఆసన్నమైందా..? దేశంలో జరుగుతున్న అలజడిపై ప్రశ్నించేందుకు సామాన్యుడి గొంతుక అవసరమైందా..? ప్రతిపక్షాలను కేజ్రీవాల్ ముందుండి నడిపించాలని ప్రజలు కోరుకుంటున్నారా..? అవును ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది చూపు కేజ్రీవాల్ వైపే ఉంది. జాతీయ రాజకీయాల్లో కేజ్రీవాల్ కీలక పాత్ర పోషించగలరని చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బంపర్ మెజార్టీతో గెలిచిన ఆమ్ఆద్మీ పార్టీ
ఈ నెలలో ఢిల్లీకి జరిగిన ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆమ్ఆద్మీ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. మిగతా పార్టీల అడ్రస్ గల్లంతైంది. 2015 ఎన్నికల్లో ఎలాగైతే ఢిల్లీ ఓటర్లు అద్భుతమైన తీర్పు ఇచ్చారో.. ఈ సారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో సామాన్యుడి వైపు మొగ్గు చూపారు. ఇక ఈ గెలుపుతో అరవింద్ కేజ్రీవాల్పై బాధ్యతలు మరింత పెరిగాయి. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న క్లిషపరిస్థితులను కేజ్రీవాల్ సమర్థవంతంగా డీల్ చేయగలరనే అభిప్రాయంను పలువురు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
సంక్షేమం వైపే మొగ్గు చూపిన ఢిల్లీ ఓటర్లు
ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఒక్కసారి సమీక్షిస్తే కేజ్రీవాల్ పార్టీకి 53శాతం ఓటు షేరు దక్కగా బీజేపీకి 38శాతం మాత్రమే ఓటుషేరు లభించింది. ఢిల్లీలో ముస్లింల జనాభా 12శాతం ఉండగా ఒకవేళ ఆ సామాజికవర్గం ఓట్లు పడకపోయినప్పటికీ కేజ్రీవాల్పై పెద్ద ప్రభావం చూపేది కాదని విశ్లేషకులు చెబుతున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దేశభక్తులు నమ్మకద్రోహులు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయనే ప్రచారంతో ముందుకెళ్లగా... కేజ్రీవాల్ మాత్రం తన ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతూ ముందుకెళ్లి విజయం సాధించారు. ఢిల్లీ ఓటరుసంక్షేమం వైపే మొగ్గుచూపారనేది స్పష్టమవుతోంది.
ఎక్కడా మతపరమైన వ్యాఖ్యలు చేయని కేజ్రీవాల్
ఇక షాహీన్బాగ్లో నిరసనల గురించి కూడా కేజ్రీవాల్ మాట్లాడారు. తనకు పూర్తి స్థాయి అధికారాలు ఇస్తే తప్పకుండా షాహీన్బాగ్లో నిరసనకారులను క్లియర్ చేయిస్తానని చెప్పారు. ప్రజాజీవితంకు ఆటకం కలిగించేది ఏది ఆమోదయోగ్యం కాదని చెప్పారు. అంతేకాదు హనుమాన్ చాలీసా గురించి కూడా ప్రస్తావించారు అరవింద్ కేజ్రీవాల్. ఇది కూడా అతని విజయంలో కొంత వరకు ప్రభావం చూపి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇదే హిందువులను కేజ్రీవాల్కు దగ్గర చేసి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో ముస్లింలపై కూడా కేజ్రీవాల్ ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు.
ఇతర రాష్ట్రాల్లో కేజ్రీవాల్ పాగా వేయడం సాధ్యమేనా..?
ఇక ఆప్ ఢిల్లీలో సాధించిన విజయంతో క్రమంగా ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరించే ప్రయత్నం చేస్తోంది. ఢిల్లీలో ఎలాగైతే సంక్షేమ పథకాలు అమలు చేసి అధికారంలోకి వచ్చిందో అలానే ఇతర రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి వస్తే తమ మేనిఫెస్టోను ఇంప్లిమెంట్ చేస్తామంటూ ముందుకు అడుగులు వేయాలని భావిస్తోంది. అయితే ఇది దాదాపు అసాధ్యంగానే కనిపిస్తోంది. ఎందుకంటే భారత్లో రాజకీయ పార్టీలు ఒక వర్గం లేదా ఒక కులం ఆధారంగా పుట్టుకొస్తున్నాయి. కర్నాటకలో లింగాయత్ సామాజిక వర్గం మద్దతుతో బీజేపీ లబ్ధి పొందుతోంది. గుజరాత్లో పాటిదార్ సపోర్ట్తోనే ఆయా పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాయి. అయితే ఆమ్ఆద్మీ పార్టీ ఒక కులం పరంగా లేదా ఒక వర్గం పరంగా వచ్చిన పార్టీ కాకపోవడంతో ఇతర రాష్ట్రాల్లో ఈ పార్టీ మనుగడ కష్టంగానే కనిపిస్తోంది.
ఇందిరా మృతితో సెక్యులర్గా మారిన కాంగ్రెస్ పార్టీ..?
ఆమ్ఆద్మీ పార్టీ ప్రభావం పట్టణాలు, మధ్యతరగతి ప్రజలను మాత్రమే ఆకట్టుకుంటుంది. తమిళనాడు లేదా మధ్యప్రదేశ్లాంటి రాష్ట్రాల్లో ఆప్ ప్రభావం ఎంతమాత్రం ఉండదు. ఆప్ కంటే ముందు హిందువుల ఓటు బ్యాంకుతో గట్టెక్కిన ప్రభుత్వాలు ఉన్నాయి. అందులో ముందుగా చెప్పుకోదగినది కాంగ్రెస్. హిందూ నేతగా ఉన్న ఇందిరాగాంధీ మృతి చెందడం ఆ తర్వాత బీజేపీ హిందూ భావజాలంను తారాస్థాయికి తీసుకెళ్లడంలో సక్సెస్ కావడంతో కాంగ్రెస్ పార్టీకి సెక్యులర్ పార్టీగా ముద్ర పడింది. మెజార్టీ ఉన్న ఒక వర్గంపై మైనార్టీలు ప్రశ్నిస్తే దాన్ని దేశద్రోహం కింద లెక్కగట్టడం ఇబ్బందికరమైన పరిణామమే అని చెప్పాలి.
Recommended Video
లోక్సభలో మోడీకి కౌంటర్ ఇవ్వగల నేత కేజ్రీవాల్ అవుతారా..?
ఇక ప్రస్తుత పరిస్థితుల్లో అరవింద్ కేజ్రీవాల్ విపక్షాలను ముందుండి నడిపించగల నేతగా చాలామంది సీనియర్ విశ్లేషకులు చూస్తున్నారు. ఢిల్లీలో ఉండటం, హిందీ మాట్లాడగలగడం, అదే సమయంలో విషయపరిజ్ఞానం కలిగి ఉండటం వంటి అంశాలు అరవింద్ కేజ్రీవాల్కు కలిసి వచ్చే అంశాలని విశ్లేషకులు చెబుతున్నారు. వ్యక్తిగతంగా ఒక రాజకీయనాయకుడు సక్సెస్కు కావాల్సిన లక్షణాలన్నీ కేజ్రీవాల్ సొంతమని అనలిస్టులు చెబుతున్నారు. విపక్షాలను నడిపించగలిగే అవకాశం కేజ్రీవాల్కు వస్తే లోక్సభలో ప్రధాని మోడీని ప్రశ్నించే సత్తా ఉన్న నాయకుడిగా కేజ్రీవాల్ ఆవిర్భవిస్తారని అనలిస్టులు చెబుతున్నారు. మొత్తానికి ఢిల్లీ విజయంతో చాలామంది భారతీయుల్లో మళ్లీ రాజకీయాలపై సరికొత్త ఆలోచన ప్రారంభమైందని చెబుతున్నారు అనలిస్టులు.