మోడీపై మిస్ఫైర్: కేజ్రీవాల్పై దుమ్మెత్తిపోసిన నెటిజన్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేయబోయి నెటిజన్ల విమర్శలు ఎదుర్కొన్నారు. కేజ్రీవాల్ తన ట్విట్టర్ అకౌంటులో పెట్టిన ఓ కార్టూన్ పైన నెటిజన్లు మండిపడ్డారు.
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ ఘటనకు సంబంధించి వేసిన ఆ కార్టూన్తో కేజ్రీవాల్ వివాదంలో చిక్కుకున్నారు. భారత పార్లమెంటుపై దాడి కేసులో అఫ్జల్గురుకు ఉరిని వ్యతిరేకిస్తూ వర్సిటీలో కొందరు విద్యార్థులు ర్యాలీ నిర్వహించడం, దానిని ఏబీవీపీ అడ్డుకున్న నేపథ్యంలో వివాదం రాజుకున్న విషయం తెలిసిందే.
విద్యార్థి సంఘాల మధ్య రాజుకున్న ఈ వివాదం తాజాగా రాజకీయ రంగు పులుముకుంది. ఈ సందర్భంగా దీనిపై ఓ కార్టూన్ వేసిన కేజ్రీవాల్.. దానిని మంగళవారం ఉదయం తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు.
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 16, 2016
ప్రధాని మోడీ ఆదేశాల మేరకు హనుమంతుడు హైదరాబాదు సెంట్రల్ వర్సిటీ, పఠాన్ కోట్, ముంబై మేకిన్ ఇండియా వేదిక... తాజాగా జెఎన్యులో చిచ్చుపెట్టినట్టు ఉన్న సదరు కార్టూన్ పై నెటిజన్లు వేగంగా స్పందించారు.
కేజ్రీవాల్ ఇన్ సల్ట్స్ హనుమాన్ పేరిట ట్విట్టర్లో ప్రత్యక్షమైన హ్యాండిల్లో నెటిజన్లు ఘాటుగా స్పందించారు. చివరకు హనుమంతుడిని కూడా వదలని కేజ్రీవాల్ పైన కేసు నమోదు చేయడమే కాక తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేశారు.