మూడోసారి ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణం: ఆరుగురు మంత్రులు కూడా, ఉచితాలపై ఇలా
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి ప్రమాణం చేశారు. కేజ్రీవాల్ తోపాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఆదివారం రాంలీలా మైదానంలో 'ధన్యవాద్ ఢిల్లీ' పేరుతో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు.
ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ అనిల్ బైజల్.. ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్తో ప్రమాణం చేయించారు. దీంతో వరుసగా మూడోసారి ఢిల్లీ సీఎంగా ఆయన ప్రమాణం చేసినట్లయింది. ప్రమాణస్వీకారోత్సవానికి అరవింద్ కేజ్రీవాల్ నుదుట తిలకంతో హాజరయ్యారు. ప్రమాణస్వీకారం సందర్భంగా భారత్ మాతా కీ జై, వందేమాతరం అనే నినాదాలు కూడా చేశారు.
ఢిల్లీని అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్రంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రచారంలో భాగంగా తమపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన ప్రత్యర్థుల్ని క్షమించేస్తున్నామని అన్నారు. ఢిల్లీ అభివృద్ధికి ఇదే వేదికపై నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులు కోరుతున్నానని తెలిపారు.
గత ప్రభుత్వంలో ఎవరిపైనా సవతి తల్లి ప్రేమ చూపలేదని.. అన్ని వర్గాలకు కలుపుకొనిపోయామని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. మీ బిడ్డ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడని ఢిల్లీ ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఢిల్లీ అంతా ఇప్పుడు తన కుటుంబమే అని, అందరి కోసం పనిచేస్తామన్నారు.
కేజ్రీవాల్తోపాటు మంత్రులుా మనీష్ సిసోడియా, కైలేష్ గెహ్లాట్, ఇమ్రాన్ హుస్సేన్, సత్యేంద్ర జైన్, గోపాల్ రాయ్, రాజేంద్ర పాల్ గౌతమ్ ప్రమాణం చేశారు. వేదికపై కేజ్రీవాల్ తోపాటు ఢిల్లీ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న వివిధ రంగాలకు చెందిన 50 మంది ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. కాగా, ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులెవరికీ ఆహ్వానాలు పంపలేదు కేజ్రీవాల్. ప్రధాని నరేంద్ర మోడీకి మాత్రం ప్రమాణస్వీకారోత్సవానికి రావాలంటూ ఇటీవలే ఆహ్వానించినట్లు విషయం తెలిసిందే.
ఢిల్లీ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ అన్ని ఉచితంగా ఇస్తామని ప్రకటించారు.. అందుకే గెలిచారు అని కొందరు అంటున్నారని.. అయితే, ప్రకృతి, తల్లిదండ్రుల మాదరిగానే తన ప్రజలకి ఉచితంగా కొన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, అది తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. తాను తన ప్రజలను ప్రేమిస్తున్నానని, తన ప్రేమ కూడా ఉచితమేనని అన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ మేనిఫెస్టోలో పలు ఉచిత పథకాలను ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ 62 స్థానాలు దక్కించుకోగా.. 8 సీట్లలో విజయం సాధించింది.