ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు జ్వరం, గొంతు నొప్పి: కరోనా టెస్ట్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనావైరస్ విజృంభిస్తున్న వేళ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అస్వస్థకు గురయ్యారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్నారు. దీంతో అధికారిక సమావేశాలన్నీ రద్దు చేసుకున్నారు.
అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను వణికించిన కరోనావైరస్..పాక్ భారత్కు అప్పగిస్తుందా..?
ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ స్వీయ నిర్బంధం(హోం ఐసోలేషన్)లో ఉండిపోయారు. కరోనావైరస్ అనుమానిత లక్షణాలు ఉండటంతో ఆయనకు మంగళవారం కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఆదివారం ఆన్ లైన్ మీడియా సమావేశం నిర్వహించిన అనంతరం నుంచి ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు.
ఈ కరోనా సంక్షోభ సమయంలో ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు మొదటి ప్రాధాన్యత ఢిల్లీ ప్రజలకే ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ఢిల్లీలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న విషయం తెలిసిందే.
ఢిల్లీలో ఇప్పటి వరకు 28,936 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో 812 మంది మృతి చెందారు. 17,125యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 10,999 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ఆదివారం ఏకంగా సుమారు 10వేల కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం.
ఇప్పటి వరకు దేశంలో 2,57,092 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,25,959 యాక్టివ్ కేసులున్నాయి. 1,23,912 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు కరోనాతో 7,208 మంది ప్రాణాలు కోల్పోయారు.