న్యూఢిల్లీ నుంచి కేజ్రీవాల్ ఓటమి ఖాయం, నియోజకవర్గం మారితే గెలిచేవారెమో..?: మనోజ్ తివారీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం హోరెత్తుతుంది. ఆప్, బీజేపీ నేతలు కత్తులు దూసుకుంటున్నారు. మరో అడుగు ముందుకేసిన ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం పాలవుతోందని చెప్పారు. దీంతోపాటు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓడిపోతాడని, సీటు మారితే గెలిచేవాడేమోనని సంచలన ఆరోపణలు చేశారు.
ఆప్కు గడ్డుకాలమే..?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆప్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొబోతుందని మనోజ్ తివారీ పేర్కొన్నారు. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓడిపోతాడని వ్యాఖ్యానించారు. ‘ఇండియా టుడే'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేశారు. న్యూ ఢిల్లీ నుంచి కాక మరో చోట నుంచి పోటీ చేసే ఉంటే గెలిచేవాడేమోనని పేర్కొన్నారు.
సీలాంపూర్ నుంచి అయితే...
సీలాంపూర్ నుంచి పోటీచేస్తే కేజ్రీవాల్ గెలిచేందుకు అవకాశాలు ఉండేవని చెప్పారు. ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో సీలాంపూర్ ఒక్కటి. అక్కడి ఓటర్లు బీజేపీకి పట్టం కట్టనందున ప్రత్యామ్నాయం ఆప్ అని పరోక్షంగా మనోజ్ తివారీ అంగీకరించారు.
గతంలో విక్టరీ
న్యూ ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆప్ నుంచి అరవింద్ కేజ్రీవాల్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి రమేశ్ సబర్వాల్, బీఎస్పీ నుంచి రామ్ గులామ్, బీజేపీ నుంచి సునీల్ యాదవ్ పోటీ చేస్తున్నారు. 2015లో న్యూఢిల్లీ నుంచి కేజ్రీవాల్ పోటీ చేయగా బీజేపీ నుంచి నుపూర్ శర్మ, కాంగ్రెస్ నుంచి కిరణ్ వాలియా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. వారిద్దరినీ మట్టి కరిపించి మరీ విజయం సాధించారు కేజ్రీవాల్.
ఆప్కు అనుకూలం..?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నేతల మధ్య డైలాగ్ వార్ పీక్కి స్టేజీకి చేరగా.. టైమ్స్ నో పోల్ సర్వే వివరాలను వెల్లడించింది. సర్వే ప్రకారం ఆప్ 54 నుంచి 60 సీట్లు గెలుచుకుంటుందని పేర్కొన్నది. బీజేపీ 10-14, కాంగ్రెస్ 2 సీట్లు గెలవబోతుందని తెలియజేసింది. టైమ్స్ నౌ సర్వే ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరింత బూస్ట్నిచ్చింది.