‘స్వేచ్ఛగా పని చేసుకోనివ్వండి’: మోడీకి ఢిల్లీ సిఎం కేజ్రివాల్ లేఖ
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వాన్ని స్వేచ్ఛగా పని చేసుకోనివ్వండని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఓ లేఖ రాశారు. ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, అరవింద్ కేజ్రివాల్కి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగున్న నేపథ్యంలో కేజ్రివాల్ ప్రధాని మోడీకి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అంతేగాక, కేంద్ర ప్రభుత్వంపైనా కేజ్రివాల్ తన లేఖలో ధ్వజమెత్తారు. లెఫ్ట్నెంట్ గవర్నర్ ద్వారా కేంద్రప్రభుత్వం ఢిల్లీలో ప్రభుత్వాన్ని నడపాలని చూస్తోందని ఆరోపించారు. బ్యూరోక్రాట్స్ బదిలీలపై జోక్యం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
కాగా, మంగళవారం ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్, సిఎం కేజ్రివాల్లు వేర్వేరుగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. వారి అధికార పరిధుల అతిక్రమణపై పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఢిల్లీలో ‘రాజ్యాంగ సంక్షోభ తరహా పరిస్థితి' తలెత్తేలా ఉందని జంగ్ ఫిర్యాదు చేయగా, ప్రతీ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకుంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇంకెందుకని కేజ్రివాల్ రాష్ట్రపతి ముందు వాదనలు వినిపించినట్లు తెలిసింది.
తాజాగా ఢిల్లీ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా రాజేంద్ర కుమార్ స్థానంలో అరవింద్ రేని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా, ఎన్నికల ద్వారా ఏర్పడిన ఢిల్లీ ప్రభుత్వంలో లెఫ్ట్నెంట్ గవర్నర్ జోక్యం బాగా పెరిగిపోయిందని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.
అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్ ఢిల్లీ సిఎం కేజ్రివాల్ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. కేజ్రివాల్ తన ‘ధర్నా మైండ్సెట్'ను మార్చుకోవాలని కోరారు. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతమని, మిగితా రాష్ట్రాల్లోలాగా ముఖ్యమంత్రికి అన్ని అధికారాలుండవని చెప్పారు.