ఆప్కే మొగ్గు ఎక్కువ.. పంజాబ్లో కేజ్రీవాల్ పాగా వేస్తాడా..?
వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సారి ఆప్ మీద అందరి దృష్టి ఉంది. గత ఎన్నికల్లో మంచి సీట్లు సాధించడంతో.. ఎలాగు ఉత్కంఠ ఉండనుంది. పంజాబ్లో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సంగతి తెలిసిందే. పీసీసీ అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ బాధ్యతలను స్వీకరించిన తర్వాత సీఎం అమరీందర్ సింగ్ తో ఆయనకు విభేదాలు తలెత్తాయి. ముఖ్యమంత్రి పదవికి అమరీందర్ రాజీనామా చేయడం... సొంత పార్టీని నెలకొల్పడం చకచకా జరిగిపోయాయి.
వచ్చే ఎన్నికల్లో పంజాబ్ లో మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోవడం కాంగ్రెస్ పార్టీకి కత్తిమీద సాముగా మారింది. దేశాన్ని శాసిస్తున్న బీజేపీకి పంజాబ్ లో ఉన్న పట్టు అంతంత మాత్రమే. ఇప్పుడు పంజాబ్ లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు మరో పార్టీకి సువర్ణావకాశంగా మారాయి. అరవింద్ కేజ్రీవాల్ కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ. తొలి నుంచి కూడా పంజాబ్ లో ఆప్ యాక్టివ్ గానే ఉంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో... రాబోయే ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఆప్ సిద్ధమవుతోంది.
'మిషన్ పంజాబ్' పేరుతో పంజాబ్ లో ఎన్నికల ప్రచారానికి అరవింద్ కేజ్రీవాల్ కిక్ స్టార్ట్ చేశారు. 'ఒక్కసారి మాకు ఓటు వేయండి. ఆ తర్వాత మరో పార్టీకి ఓటు వేయాలనే భావన కూడా మీకు కలగదు. మీ ఆకాంక్షలను మేము నెరవేరుస్తాం' అని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు గాను ఆప్ 20 సీట్లను గెలుచుకుంది. అయితే ఎంపీ స్థానాలను మాత్రం ఆ పార్టీ కోల్పోయింది. 2014లో నాలుగు ఎంపీ స్థానాలను గెల్చుకున్న ఆప్... 2019లో కేవలం ఒక్క స్థానానికి మాత్రమే పరిమితమయింది.
జాతీయ మీడియా సంస్థలు చేస్తున్న సర్వేలలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆకాళీ పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్ లపై పంజాబ్ ప్రజల్లో అసంతృప్తి ఎక్కువవుతోంది. ఆ పార్టీలకు ఆప్ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత కలహాలు కూడా ఆప్ కు సానుకూలంగా మారాయి. ప్రస్తుత పరిస్థితులు ఆప్ కు అనుకూలంగా ఉన్నాయని కాంగ్రెస్ కీలక ఎమ్మెల్యే ఒకరు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పేదలను ఆప్ ఆకట్టుకున్నట్టయితే ఆ పార్టీకి తిరుగు ఉండదని చెప్పారు. ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలు చేసిందేమీ లేదని... ఆప్ కు ఒక అవకాశం ఇస్తే పేదల ఆకాంక్షలు తీరుతాయని కామెంట్స్ చేశారు.
2017లో కాంగ్రెస్ కు ఓటు వేసిన జ్యోతి ఖన్నా అనే ఒక మహిళ మాట్లాడుతూ... ప్రజలు కోరుకున్న విధంగా కాంగ్రెస్ పాలన లేదని కుండ బద్దలు కొట్టారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మారుస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని... ఆ హామీని కాంగ్రెస్ నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. ఇప్పటికీ ఎంతో మంది యువకులు డ్రగ్స్ తీసుకుంటుండటాన్ని తాను చూస్తూనే ఉన్నానని చెప్పారు. పంజాబ్ రాష్ట్రం ఆప్ కు ఒక్క ఛాన్స్ ఇవ్వాల్సిందేనని ఆమె అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాల వల్ల మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆ పార్టీ నుంచి బయటకు రావడం ఆమ్ ఆద్మీ పార్టీపై పాలు చల్లినట్టయింది. ఇది కేజ్రీవాల్ పార్టీకి పూర్తిగా అనుకూలంగా మారింది. అన్ని పార్టీలను చూసిన పంజాబ్ ఓటర్లలో అనేక మంది ఈసారి ఆప్ కు అవకాశం ఇవ్వాలనే యోచనలో ఉన్నారు. పరిస్థితులన్నీ ఇలాగే కొనసాగితే అరవింద్ కేజ్రీవాల్ మరో రాష్ట్రంలో జెండా ఎగురవేయడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరెంతగా మారుతాయో వేచి చూడాలి.