ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు : ఆ ఇద్దరు నిందితులకు బెయిల్ మంజూరు చేసిన ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు
బాలీవుడ్ లో ప్రకంపనలు రేపిన అక్టోబర్ 2న ముంబై తీరంలో క్రూయిజ్ షిప్పై దాడి కేసులో అరెస్టయిన ఇద్దరు నిందితులకు ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు ఈరోజు బెయిల్ మంజూరు చేసింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అరెస్టు చేసిన ఇద్దరు నిందితులు మనీష్ రాజ్గారియా మరియు అవిన్ సాహులకు ప్రత్యేక ఎన్డీపీఎస్ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది.
drugs case: బొంబాయి హైకోర్టులో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ పై వాదనలు; విచారణ రేపటికి వాయిదా !!
ఆర్యన్ ఖాన్ బెయిల్ పై బొంబాయి హైకోర్టులో వాదనలు .. రేపటికి విచారణ వాయిదా
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఇదే కేసులో అరెస్టయ్యాడు. అయితే ఆర్యన్ ఖాన్ కు మాత్రం ఈ కేసు నుంచి ఇప్పటివరకు ఊరట లభించలేదు. ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్లు పదే పదే తిరస్కరించబడ్డాయి. ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో ప్రస్తుతం బొంబాయి హైకోర్టును ఆశ్రయించాడు. ఈ రోజు అతని బెయిల్ పిటిషన్ విచారణను సాగించిన కోర్టు కేసు విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో పట్టుబడిన మరో ఇద్దరి బెయిల్ పిటిషన్పై విచారణ
ఇదిలా ఉంటే క్రూయిజ్ షిప్లో అతిథిగా ఆహ్వానించబడిన రాజ్గారియా, కొద్ది మొత్తంలో హైడ్రోపోనిక్ వీడ్ మల్టీ-స్ట్రెయిన్ గంజాయితో అరెస్టయ్యాడు. ఎన్సీబీ అధికారుల ప్రకారం, వినియోగం ఆరోపణలపై సాహును అరెస్టు చేశారు. అక్టోబరు 5న అరెస్టు చేసినప్పటి నుంచి వారు ఎన్సీబీ కస్టడీలో ఉన్నారు. వీరిద్దరూ ఒడిశాలోని రూర్కెలాకు చెందిన వారని ఏజెన్సీ తెలిపింది. అంతకుముందు రాజ్గారియా బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా, అతని న్యాయవాది తారక్ సయ్యద్ ఎన్డిపిఎస్ కోర్టుకు తన క్లయింట్ వద్ద 2.4 గ్రాముల గంజాయి ఉందని, "అతి చిన్న పరిమాణం" ఎన్సీబీ అధికారులు రికవరీ చేసి, అరెస్టు చేసినట్లు చెప్పారు.
ఇద్దరికీ బెయిల్ మంజూరు చేసిన ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు
అయితే అధికారులు ఈ గంజాయిని వారు ఎక్కడ నుండి గుర్తించారో 'పంచనామా'లో కూడా పేర్కొనలేదని ఆయన వాదించారు. సాహు తరపు న్యాయవాది సనా ఖాన్ తన క్లయింట్ నుండి ఎలాంటి డ్రగ్స్ లభించలేదని పేర్కొన్నారు. పార్టీలో రెండుసార్లు గంజాయి సేవించాడనేది సాహుపై ఉన్న ఏకైక ఆరోపణ అని ఆమె తెలిపారు. ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు వీళ్ళిద్దరికీ ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ముందుగా బెయిల్ వచ్చిన వారు వీరే కావటం గమనార్హం.
డ్రగ్స్ కేసులో 20 మందిని అరెస్టు చేసిన ఎన్సీబీ
గోవా వెళ్తున్న క్రూయిజ్ షిప్ లో జరుగుతున్న పార్టీపై దాడి చేసిన ఎన్సీబీ అధికారులు 13 గ్రాముల కొకైన్, ఐదు గ్రాముల ఎండీ, 21 గ్రాముల చరస్, 22 ఎక్స్టాసీ మాత్రలు, రూ.1.33 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్సీబీ దాడుల అనంతరం తెలిపింది. ఈ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ ఇప్పటివరకు 20 మందిని అరెస్టు చేసింది. ఈ డ్రగ్ కేసుకు అంతర్జాతీయ రాకెట్తో సంబంధాలు ఉన్నాయని, కుట్రను వెలికితీసేందుకు ఏజెన్సీ ప్రయత్నిస్తోందని సెషన్స్ మరియు ప్రత్యేక ఎన్డీపీఎస్ కోర్టుకు కూడా తెలిపింది.
Recommended Video
ఆర్యన్ ఖాన్ కు లభించని బెయిల్
అయితే ఇప్పటివరకు ఈ కేసులో బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు మాత్రం బెయిల్ లభించలేదు. ఇప్పటికి మూడు సార్లు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ తిరస్కరించబడింది. ప్రస్తుతం బొంబాయి హైకోర్టులో ఆర్యన్ బెయిల్ పిటిషన్ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఎన్సీబీ అధికారులు ఆర్యన్ ఖాన్ ను ఈ కేసులో ఏ1 గా పేర్కొనడంతో పాటు డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ కీలక భూమిక పోషించారని చూపించే ప్రయత్నం చేస్తుంది.