ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు: సెల్ఫ్ డిఫెన్స్ లో సమీర్ వాంఖడే; తనపై కుట్ర అంటూ ముంబై పోలీసులకు ఫిర్యాదు
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. ఈ కేసులో ఆర్యన్ ఖాన్ కు ఉచ్చు బిగించడం కోసం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్పతివరకు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ రాకుండా అడుగడుగునా అడ్డుకుంటుంది. ఈ క్రమంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే పై బాలీవుడ్ వర్గాల నుండి, అలాగే మహారాష్ట్ర మంత్రుల నుండి ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చాయి. ఇక తాజాగా ఈ కేసులో సమీర్ వాంఖడేపై ఓ సాక్షి చేసిన వ్యాఖ్యలు పెను దుమారంగా మారాయి.
సమీర్ వాంఖడే కు తలనొప్పిగా మారిన ఆర్యన్ ఖాన్ కేసు సాక్షి అఫిడవిట్
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు 25 కోట్లు చెల్లిస్తే ఆర్యన్ ఖాన్ ను వదిలేయడానికి డీల్ మాట్లాడినట్టు ఆ సాక్షి వెల్లడించడం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే కు తలనొప్పిగా మారింది. ముంబై క్రూయిజ్ షిప్ లో మాదకద్రవ్యాలు పట్టుబడిన కేసును విచారిస్తున్న సమీర్ వాంఖడే పై తాజాగా వెల్లువెత్తిన ఆరోపణల నేపథ్యంలో ఆయన దీనిపై సీరియస్ గా స్పందించారు. ఈ కేసులో తనపై కుట్ర జరుగుతోందని, తనని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని సమీర్ వాంఖడే ముంబై పోలీసులను ఆశ్రయించారు.
తనపై కుట్ర జరుగుతుందని ముంబై పోలీస్ చీఫ్ కు ఫిర్యాదు లేఖ
తనపై దురుద్దేశ పూర్వకంగానే దాడి జరుగుతోందని ఆయన ముంబై పోలీస్ చీఫ్ హేమంత్ నాగ్రాలేకు రాసిన లేఖలో పేర్కొన్నారు. తనపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా చూడాలని కంప్లైంట్ చేసిన సమీర్ వాంఖడే, తనపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని అందులో వెల్లడించారు. ఆర్యన్ ఖాన్ కేసులో గుర్తుతెలియని వ్యక్తులు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తనపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా, ఈ కేసును నీరుగార్చడానికి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు . విచారణ ఆగిపోయేలా కుట్రలు చేస్తున్నారని నా దృష్టికి వచ్చింది అని ఫిర్యాదులో పేర్కొన్న సమీర్ వాంఖడే, ఎవరినో తాను బెదిరించినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి అంటూ, తనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరారు.
ఆరోపణలపై ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కు ఫిర్యాదు చేశానని చెప్పిన సమీర్ వాంఖడే
ఇప్పటికే తాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అశోక్ ముఠా జైన్ కు తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవటం కోసం నివేదించాలని సమీర్ వాంఖడే ముంబై పోలీస్ బాస్ కు తెలిపారు. కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఆర్యన్ ఖాన్ కేసులో సాక్షిగా ఉన్న కేపీ గోసావి బాడీగార్డ్ ప్రభాకర్ సెయిల్ ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖెడే తరపున గోసావి 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్టు పేర్కొన్నారు. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కెపి గోసావికి వ్యక్తిగత అంగరక్షకుడిగా చెప్పుకునే ప్రభాకర్ సెయిల్, అక్టోబరు 3న రూ. 18 కోట్ల డీల్ గురించి సంభాషణ విన్నట్లు పేర్కొన్నాడు.
ఆర్యన్ ఖాన్ ను వదిలెయ్యటం కోసం 25 కోట్ల డీల్ .. వెల్లడించిన సాక్షి ప్రభాకర్
శామ్ డిసౌజా అనే వ్యక్తితో మీరు 25 కోట్ల బాంబు పెట్టారు దీని 18 కోట్లకు సెటిల్ చేసుకుంటామంటూ మాట్లాడినట్టు, ప్రైవేట్ డిటెక్టివ్ కేపీ గోసావి, శామ్ డిసౌజా కు మధ్య జరిగిన చర్చలో సమీర్ వాంఖడేకి రూ. 8 కోట్లు ఇవ్వవలసి ఉంటుందని చెప్పినట్టు విన్నానని ప్రభాకర్ చెప్పారు. కెపి గోసావి, శామ్ డిసౌజా మరియు పూజా దడ్లాని, మెగాస్టార్ షారూఖ్ ఖాన్ మేనేజర్, కారు లోపల 15 నిమిషాలు సమావేశమయ్యారని , ఈ కేసులో ఎన్సిబి సాక్షులుగా పేర్కొన్న తొమ్మిది మంది సాక్షులలో ఒకరైన ప్రభాకర్ సెయిల్ అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఈ అఫిడవిట్ ఇప్పుడు దుమారంగా మారగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే దీనిని తీవ్రంగా ఖండిచారు.
ప్రభాకర్ అఫిడవిట్ పై విచారణ కోరుతున్న శివ సేన నాయకుడు సంజయ్ రౌత్
శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ ప్రభాకర్ సెయిల్ యొక్క అఫిడవిట్ గురించి దర్యాప్తు చేయాలని పోలీసులను కోరారు. ఈ కేసు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరిచేలా ఉందని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్య నిజమవుతున్నట్లు కనిపిస్తోందని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. సంజయ్ రౌత్ ఒక కొత్త వీడియోను కూడా ట్వీట్ చేసారు. స్పష్టంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆఫీస్ లోపల నుండి, అక్కడ కేపీ గోసావి మరియు ఆర్యన్ ఖాన్ కలిసి కూర్చుని ఉన్నారని, ఆర్యన్ ఖాన్ గోసావి చేతిలో ఉన్న ఫోన్లో మాట్లాడుతున్నట్లు కనిపించాడని ఒక వీడియోను ట్వీట్ చేశారు.
సమీర్ వాంఖడే ను టార్గెట్ చేసిన మహా మంత్రి నవాబ్ మాలిక్
మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారి సమీర్ వాంఖడే ఉద్యోగం పోతుందని వ్యాఖ్యలు చేశారు . వాంఖడే బిజెపికి కీలుబొమ్మగా మారారని ఆరోపించారు. వాంఖడే బాలీవుడ్ సెలబ్రిటీల పై బోగస్ కేసులను లేవనెత్తాడని విమర్శించారు. తాను వాంఖడేను సవాలు చేస్తున్నాను, అతను ఏడాదిలోపు ఉద్యోగం కోల్పోతాడని పేర్కొన్న నవాబ్ మాలిక్ తమ వద్ద బోగస్ కేసులకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని చెప్పినట్లు తెలుస్తుంది.
Recommended Video
సరైన సమయంలో సమాధానమిస్తాం అంటున్న సమీర్ వాంఖడే
కానీ సమీర్ వాంఖడే కేసులో విచారణ అడ్డుకునే కుట్ర అని తేల్చి చెప్తున్నారు. అందరికీ సరైన సమయంలో ధీటైన సమాధానం చెప్తామని అంటున్నారు. ఆ అఫిడవిట్ ను ఎన్సీబీ కోర్టులో సమర్పించినా అక్కడ తాము సమాధానం చెప్పగలమని ఆయన పేర్కొన్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ప్రతిష్టను దిగజార్చటం కోసమే ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో తాజా ఆరోపణలతో స్వీయ రక్షణలో పడ్డారు సమీర్ వాంఖడే.