ఇండియాకు చేరుకొన్న 38 మృతదేహలు: ఆదుకొంటామన్న పంజాబ్ సర్కార్
న్యూఢిల్లీ: ఇరాక్లో పని కోసం వలస వెళ్ళిన 39 మంది భారతీయులను ఐసిస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేసి చంపేశారు. నాలుగేళ్ళుగా వీరి రాకకోసం వారి కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. అయితే వీరు చనిపోయారని రెండు వారాల క్రితం రాజ్యసభలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించారు. ఇరాక్లో భద్రపర్చిన మృతదేహలను కేంద్ర మంత్రి వీకేసీంగ్ ప్రత్యేక విమానంలో ఇండియాకు తీసుకొచ్చారు.
మృతుల్లో ఎక్కువగా పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు ఉన్నారు. మృతదేహలను తీసుకొచ్చేందుకు కేంద్ర మంత్రి వీకే సింగ్ ఆదివారం నాడే ప్రత్యేక విమానంలో ఇరాక్లోని మోసుల్ పట్టణానికి వెళ్ళాడు. ఈ నగరంలోనే కూలీలుగా పనిచేస్తున్న భారతీయులను 2014లో ఐసీస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేసి హత్య చేశారు. ఇండియాలో ఉన్నవారి డిఎన్ఏ పరీక్షలతో మృతుల డిఎన్ఏ నమూనాలు సరిపోవడంతో ఈ మృతదేహలను ఇరాక్ అప్పగించింది.
మృతుల్లో పంజాబ్, హిమాచల్ప్రదేశ్, పశ్చిమబంగా, బీహర్ రాష్ట్రాలకు చెందినవారున్నారు. ఇరాక్లో ఐసీస్ ఘాతుకానికి మరణించిన పంజాబ్ వాసుల కుటుంబాలను ఆదుకొంటామని పంజాబ్ రాష్ట్ర మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ ప్రకటించారు. చనిపోయిన 39 మందిలో పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారే 27 మంది ఉన్నారు. ఇప్పటివరకు వీరంతా సజీవంగా వస్తారని భావించిన వారి కుటుంబాల్లో రెండు వారాల క్రితం రాజ్యసభలో కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ చేసిన ప్రకటన తీవ్ర విషాదాన్ని నింపింది.
ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వనున్నట్టు సిద్దూ ప్రకటించారు. దీనికి తోడుగా బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామన్నారు. ఇప్పటివరకు ఇస్తున్న రూ. 20వేల పెన్షన్ను కూడ కొనసాగిస్తామని ఆయన హమీ ఇచ్చారు.