ఒక హిందువుగా మసీదుకు వెళ్లబోనన్న యోగి - టోపీ ధారణ సెక్యూలరిజమా? - యూపీ సీఎం వ్యాఖ్యలపై దుమారం
ఒక హిందువుగా, అందునా యోగిగా తాను ఎట్టి పరిస్థితుల్లోనూ మసీదు ప్రారంభోత్సవానికి వెళ్లబోనంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి. రాజ్యాంగ పదవిలో కొనసాగుతూ ఇలాంటి మాటలు తగదని, ముఖ్యమంత్రి స్థానికే ఆయన కళంకం తెచ్చారని ప్రతిపక్ష పార్టీలు ఆక్షేపించాయి. సీఎం తక్షణమే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. ఉత్తరప్రదేశ్ సహా దేశమంతటా యోగి వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. సోషల్ మీడియాలోనూ దీనిపై పెద్ద ఎత్తున వాగ్వాదాలు జరుగుతున్నాయి.
సీఎం జగన్, సోము వీర్రాజుపై రఘురామ ఫైర్ - వేట కుక్కల్లా తరుముతారు - 13 రాజధానులకు అర్థముందా?
అసలేం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య పట్టణంలో భవ్య రామ మందిర నిర్మాణానికి రెండ్రోజుల కిందటే భూమి పూజ జరగడం, ఆ వేడుకకు ముఖ్యఅతిథులుగా హాజరైనవాళ్లలో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉండటం తెలిసిందే. అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. విధ్వంసానికి గురైన బాబ్రీ మసీదును వేరొక చోట నిర్మించేందుకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించిన నేపథ్యంలో.. భూమి పూజకు వెళ్లినట్లే, మసీదు ప్రారంభోత్సవానికి కూడా వెళతారా? అన్న ప్రశ్నకు యోగి చెప్పిన సమాధానంపై వివాదం రాజుకుంది.
ముఖ్యమంత్రిగా అలానే ఉంటా..
‘‘ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మత విశ్వాసాలపై నాకు ఎలాంటి సమస్యా లేదు. కానీ ఒక హిందువుగా, సనాతన ధర్మాన్ని నమ్మి, దాన్నే ఆచరించే యోగిగా మాత్రం నా ఉపాసన విధిని కచ్చితంగా పాటిస్తాను. మసీదు ప్రారంభోత్సవానికి నన్నెవరూ పిలవలేరు. ఒకవేళ పిలిచినా నేను వెళ్లబోను. ఈ విషయంలో నా హక్కులు ఎవరూ కాదనలేనివి. నన్నుగానీ మసీదు ప్రారంభోత్సవానికి పిలిస్తే కొందరి లౌకికవాదం ప్రమాదంలో పడే అవకాశమంది. కాబట్టి వాళ్లు ఆ రిస్క్ చేయబోరనే నేను అనుకుంటున్నాను''అని సీఎం యోగి అన్నారు. ఓ ప్రముఖ జాతీయ చానెల్ లో అయోధ్యపై ఇచ్చిన ఇటర్వ్యూలో ఆయనీ కామెంట్లు చేశారు.
ఏపీలో కొత్త జిల్లాలు: ఆ మెలికకు అర్థమేంటి? - మూడు నెలల డెడ్ లైన్ తో కమిటీ - నీలం వెళ్లేలోపే..
టోపీ పెట్టుకోవడం సెక్యూలరిజమా?
ఈద్గాలకు లేదా ఇఫ్తార్ విందులకు వెళ్లి స్కల్ టోపీలు పెట్టుకోవడం మాత్రమే సెక్యూలరిజం అవుతుందా? అని యూపీ సీఎం ప్రశ్నించారు. అవన్నీ నేతలు చేసే నాటకాలేనన్న విషయాన్ని ప్రజలు ఇప్పటికే గుర్తించారని వ్యాఖ్యానించారు. అయోధ్యలో మందిరం-మసీదు వివాదం విషయంలో కాంగ్రెస్ దగ్గర్నుంచి మిగతా పార్టీలన్నీ రాజకీయ లబ్దికోసం ప్రయత్నించాయేగానీ, సమస్య పరిష్కారానికి మార్గాలు చూపలేకపోయాయని యోగి మండిపడ్డారు.
Recommended Video
హిందువులకే సీఎం కారుగా..
మసీదు ప్రారంభోత్సవానికి పిలిస్తే వెళ్లబోనంటూ సీఎం యోగి చేసిన కామెంట్లపై యూపీ ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. ‘‘యోగి హిందువులకు మాత్రమే కాదు.. రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రినన్న విషయం మర్చిపోతున్నారు. మసీదుపై వ్యాఖ్యల ద్వారా రాజ్యాంగంపై చేసిన ప్రమాణాన్ని ఆయన మీరారు. అంత పెద్ద పదవిలో ఉండి ఇంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం తగదు. ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలి''అని ఎస్పీ అధికార ప్రతినిధి పవన్ పాండే డిమాండ్ చేశారు. కాగా, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ వివాదంలో తానేమీ మాట్లాడదల్చుకోలేదని చెప్పడం గమనార్హం. అందరి దేవుడైన శ్రీరాముణ్ని బీజేపీ మాత్రం రాజకీయాలకు వాడుకుంటున్నదని, ఆ పార్టీది ఫేక్ హిందూత్వ అని యూపీ కాంగ్రెస్ మీడియా కన్వీనర్ లల్లన్ కుమార్ విమర్శించారు.