పక్క రాష్ట్రాల్లోనే ఉత్కంఠ.. జల్లికట్టుతో ఎంజాయ్ చేస్తోన్న తమిళ తంబీలు
మధురై, అలంగనల్లూర్ ప్రాంతాల్లోని చాలాచోట్ల అక్కడి జనం జల్లికట్టుతో బిజీగా గడుపుతున్నారు. 19-25ఏళ్ల వయసున్న యువకులంతా ఎద్దుల వెనుక పరిగెత్తుతూ వాటిని బంధించేందుకు పోటీలు పడుతున్నారు.
చెన్నై: పరిస్థితి చూస్తోంటే.. తమిళనాట నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై పక్క రాష్ట్రాలకు ఉన్న ఉత్కంఠ ఆ రాష్ట్ర జనానికి ఉన్నట్టుగా కనిపించడం లేదు. పన్నీర్-శశికళ మధ్య నడుస్తోన్న వార్ లో ఎవరిది పైచేయి అవుతుందని దేశమంతా ఆసక్తిగా ఎదరుచూస్తుంటే.. అక్కడి తమిళ తంబీలు మాత్రం జల్లికట్టులో నిమగ్నమైపోయారు.
మధురై, అలంగనల్లూర్ ప్రాంతాల్లోని చాలాచోట్ల అక్కడి జనం జల్లికట్టుతో బిజీగా గడుపుతున్నారు. 19-25ఏళ్ల వయసున్న యువకులంతా ఎద్దుల వెనుక పరిగెత్తుతూ వాటిని బంధించేందుకు పోటీలు పడుతున్నారు. ఈలలు, చప్పట్లు, కేరింతలతో జల్లికట్టును ఎంజాయ్ చేస్తున్న అక్కడి యువత తమిళ పాలిటిక్స్ పై అంతగా ఫోకస్ చేయట్లేదని తెలుస్తోంది.
కాగా, సాధారణంగా జల్లికట్టు క్రీడను తొలుత సీఎం.. ఆ తర్వాత ఆయా ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యేలు ప్రారంభించడం ఆనవాయితీ. అయితే తమిళనాట కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి కారణంగా మధురైలో డీఎంకె అధ్యక్షుడు స్టాలిన్ జల్లికట్టును ప్రారంభించారు.
మధురైతో పాటు పలు ప్రాంతాల్లోను జల్లికట్టును స్టాలిన్ ప్రారంభించారు. దీంతో తమిళ జనం అన్నాడీఎంకెను పక్కనబెట్టి డీఎంకె వైపు ఆకర్షితులవుతున్నట్టుగా పరిశీలకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా జల్లికట్టు క్రీడను ఆస్వాదించడంలో నిమగ్నమైన అక్కడి యువత తమిళ పాలిటిక్స్ తో సంబంధం లేకుండా ఆటను ఎంజాయ్ చేస్తున్నారు.