సిపిఎంలో కాంగ్రెస్ చిచ్చు: రాజీనామాకు సిద్ధపడిన సీతారాం ఏచూరి
Recommended Video
హైదరాబాద్: సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి పార్టీలో అనూహ్యమైన ఎదురు దెబ్బ తగిలింది. సిపిఎంలో కాంగ్రెసు చిచ్చు రగిలింది. కాంగ్రెసుతో పొత్తు పెట్టుకునే విషయంపై కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించడంలో ఆయన రెండోసారి విఫలమయ్యారు.
ఏచూరి చేసిన ప్రతిపాదనను కేంద్ర కమిటీ తోసిపుచ్చింది. దీంతో ఆయన రాజీనామాకు సిద్ధపడినట్లు సమాచారం. కోల్కతాలో ఆదివారం నిర్వహించిన కేంద్ర కమిటీ ఓటింగులో 55 - 31 తేడాతో ఏచూరి చేసిన ప్రతిపాదన వీగిపోయింది.
మనస్తాపానికి గురై...
తన ప్రతిపాదనను కేంద్ర కమిటీ తిరస్కరించడంతో మనస్తాపానికి గురైన సీతారాం ఏచూరి రాజీనామాకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. అయితే, ఏచూరిని కొనసాగించాల్సిందిగా పోలీట్ బ్యూరో, కేంద్ర కమిటీ కోరింది. దాంతో ఆయన వెనక్కి తగ్గారు. అయితే, ఏప్రిల్లో హైదరాబాదులో జరిగే ఆంతరంగిక సమావేశంలో దానిపై తేల్చుకునేందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు.
సిపిఎం తీర్మానం ఇలా...
2019లో జరిగే ఎన్నికల్లో బిజెపిని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని సిపిఎం ఆరు నెలల క్రితం ప్రతిపాదన చేసింది. పార్టీ ఓటు బ్యాంకు పెంచుకోవడానికి బిజెపి వ్యతిరేక కూటమితో చేతులు కలపాలని ఏచూరి ప్రతిపాదించారు. అయితే, అది ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తుందని, పార్టీ నైతిక విలువలు దెబ్బ తింటాయని అంటూ కాంగ్రెసు పార్టీవి మోసపూరిత రాజకీయాలంటూ ప్రకాశ్ కారత్ ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు.
ఏచూరికి అచ్యుతానందన్ మద్దతు
ఏచూరి ప్రతిపాదనకు అచ్యుతానందన్ మద్దతు ప్రకటించారు. ప్రకాశ్ కారత్ ప్రతిపాదనకు కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన చెందిన నేతలు, పార్టీ కార్మిక విభాగం సిఐటియు నాయకులు ప్రకాశ్ కారత్కు మద్దతు ప్రకటించారు.
ముసాయిదాపై కేంద్ర కమిటీ చర్చలు
అయితే, ఆ పరిణామాలపై స్పష్టత రాకపోవడంంతో కోల్కతాలో నిర్వహించిన కేంద్ర కమిటీ భేటీలో కారత్ - ఏచూరి ప్రతిపాదనలపై మూడు రోజుల పాటు చర్చించారు. శనివారం రాత్రి వరకు కూడా సమస్య కొలిక్కి రాలేదు. దీంతో ఆదివారంనాడు ఓటింగు నిర్వహించారు ఈ ఓటింగులో ఏచూరి ప్రతిపాదన వీగిపోయింది.
సీతారాం ఏచూరి ఓడిపోలేదు.
ముసాయిదా వీగిపోయినప్పటికీ సీతారాం ఏచూరికి పశ్చిమ బెంగాల్ శాఖ గట్టి మద్దతు ఇస్తోంది. ప్రతిపాదన మాత్రమే వీగిపోయిందని, కానీ సీతారాం ఏచూరి ఓడిపోలేదని, ఆంతరంగిక సమావేశంలో ఆ విషయంపై తేల్చుకుంటామని ఓ ప్రకటన విడుదల చేసింది.