ఇలా చేయండి: పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై ప్రధాని నరేంద్ర మోడీ సూచనలు
న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరుగుతున్న ముడి చమురు ధరల నియంత్రణకు ప్రధాని నరేంద్ర మోడీ ఓ సలహా ఇచ్చారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం కోసం చమురు ఉత్పత్తి సంస్థలు, కొనుగోలుదారులు కలిసి ఓ భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాణిజ్యపరంగా చమురు వెలికితీత కోసం ఉత్పత్తి సంస్థలు మిగులు పెట్టుబడులు పెట్టాలని కోరారు.
ఇంధన, చమురు రంగాల్లోని దేశ, విదేశీ సంస్థల సీఈవోలతో ప్రధాని మోడీ సోమవారం భేటి అయ్యారు. చమురు, వాయు రంగాల్లో భారత ప్రత్యేక స్థానం గురించి ఆయన వివరించారు. చమురు విపణి మొత్తం ఉత్పత్తి కేంద్రంగా నడుస్తోందని, ఉత్పత్తి దేశాలే ధరలు, పరిమాణాన్ని నిర్ణయిస్తున్నాయని చెప్పారు.
తగినంత ఉత్పత్తి జరుగుతున్నా చమురు మార్కెట్కు ఉన్న ప్రత్యేక లక్షణాలతో ఇంధన ధరలు పెంచుతున్నారని, అందుకే ఇతర మార్కెట్లలో మాదిరిగా ఇక్కడా వినియోగదారులు, ఉత్పత్తిదారుల భాగస్వామ్యం ఉండాలన్నారు. ఇది అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం తీసుకొచ్చేందుకు ఉపయోగంగా ఉంటుందన్నారు.
చమురు ఉత్పత్తి దేశాల మధ్య సహకారం అత్యంత అవసరమని తెలిపారు. అందుకే అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ఇంధన రంగంలో చమురు వెలికి తీతకు ఉత్పత్తి సంస్థలు మిగులు పెట్టబడులు పెట్టాలని కోరారు. ఈ రంగంలో సాంకేతికత, విస్తరణ పరంగా అభివృద్ధి చెందిన దేశాలు సహకారం అందించాలన్నారు. వాయు రంగంలో పంపిణీకి ప్రయివేటు సంస్థల ముందుకు రావడం అవసరమన్నారు.