భర్త బండి నడిపితే, భార్య ఫోన్లు లాగేస్తుంది.. పోలీసుల అదుపులో కంత్రీజంట..
భార్యభర్తల బంధం, వారి మద్య అన్యోన్యత గురించి ప్రముఖ ఇంగ్లీష్ కవులు చెప్పిన కొటేషన్లు మనందరికీ ఎరుకే. ఎటొచ్చీ అలాంటి జంట జనం కంటపడటమే అరుదు. ఇదిగో.. ఢిల్లీకి చెందిన ఈ దంపతులిద్దరూ అలాంటివాళ్లే.. కాకుంటే కాస్త తేడా టైప్ అన్నమాట. డ్రైవింగ్ సీటులో భర్త బండి నడుపుతుంటూ.. వెనకాలే కూర్చునే ఆమె.. జనం చేతిలో నుంచి సెల్ ఫోన్లు తస్కరిస్తుంది. ఢిల్లీ సెంట్రల్ జిల్లా పరిధిలో కొంతకాలంగా స్నాచింగ్ లకు పాల్పడుతోన్న ఈ కంత్రీజంటను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. డీసీపీ సంజయ్ భాటియా చెప్పిన వివరాలివి..
లాక్ డౌన్ తో మలుపు..
సెంట్రల్ ఢిల్లీలోని పహార్జంగ్కు చెందిన అర్జున్ అలియాస్ కరణ్ పక్కా క్రిమినల్ టైప్. చదువు మధ్యలోనే ఆపేసి బలాదూర్ గా తిరుగుతూ, డ్రగ్స్ దందా చేసేవాడు. ఇతనిపై ఇదివరకే 31 కేసలున్నాయి. అదే ప్రాంతానికి చెందిన టాటూ ఆర్టిస్ట్ వైశాలి అలియాస్ సీమా.. అర్జున్ దగ్గర్నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసేది. క్రమంగా వారి పరిచయం ప్రేమగా మారి, నాలుగు నెలల కిందటే పెళ్లిచేసుకున్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా వైశాలీ పని కోల్పోయింది, కస్టమర్లు లేక అర్జున్ దందా కూడా తగ్గిపోయింది. డబ్బులకు బాగా ఇబ్బంది ఏర్పడటంతో ఈ జంట స్నాచింగ్స్ పై దృష్టిపెట్టారు..
సినీ ఫక్కీలో..
బంటీ ఔర్ బబ్లీ సినిమా స్టైల్లో అర్జున్-వైశాలి కలిసి దొంగతనాలు చేయాలని ఫిక్స్ అయ్యారు. ముందుగా రఘుబీర్ నగర్ ఏరియాలో ఓ స్కూటీని కొట్టేశారు. భర్త బండి నడిపితే, వెనకాలే కూర్చున్న భర్య.. సెల్ ఫోన్లను లాగేసుకుని ఉడాయించేవారు. సెంట్రల్ ఢిల్లీలో పలువురు బాధితులు ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పహార్ గంజ్ ఏసీపీ ఓంప్రకాశ్ లేఖ్వాల్ పర్యవేక్షణలో డీబీజీ రోడ్ ఎస్హెచ్వో మధుకర్ రాకేశ్ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటైంది. స్నాచింగ్స్ జరిగిన ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. ఫోన్లను లాగేసుకుంది మహిళేనని నిర్ధారణకు వచ్చారు. అయితే ఫుటేజీ క్లియర్ గా లేకపోవడంతో వాళ్ల ముఖాలను గుర్తుపట్టలేకపోయారు.
ఇలా దొరికిపోయారు..
అర్జున్-వైశాలీ దొంగతనాల కోసం ఒకే బైక్ ను వాడుతున్నట్లు కనిపెట్టిన పోలీసులు.. ఆ బండి కదలికలపై నిఘా పెట్టారు. రెండ్రోజుల కిందట కిషన్ గంజ్ రైల్వే కాలనీలో స్నాచింగ్ చేసి పారిపోతున్న జంటను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఇద్దరిపైనా కేసులు నమోదు నమోదచేసి కటకటాల్లోకి పంపారు. దొంగిలించిన స్కూటీతోపాటు సెల్ ఫోన్లనూ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.
Recommended Video
డ్రగ్స్ కోసమే..
అర్జున్-వైశాలి ఇద్దరూ డ్రగ్స్ కు బానిసలయ్యారని, పనులు కోల్పోయి, డ్రగ్స్ కొనడానికి డబ్బులు లేకే స్నాచింగ్ లు మొదుపెట్టారని, దొంగిలించిన సెల్ ఫోన్లను సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అమ్మేందుకు ప్రయత్నించారని పోలీసులు చెప్పారు. కరోల్ బాగ్ లోని ప్రఖ్యాత పీపీ జువెలర్స్ దుకాణం ముందు సెక్యూరిటీ గార్డు దగ్గర్నుంచి కూడా వైశాలీ ఫోన్ కొట్టేసినట్లు వెల్లడైంది. ఇప్పటిదాకా ఆ జంటకు సంబంధించిన బంధువులెవరూ తమను సంప్రదించలేదని పోలీసులు తెలిపారు.