నిర్దాక్షిణ్యంగా సాగనంపుతున్నారు.. ఉద్యోగాలు గాల్లో దీపమే.. ఇదీ భారత్లో పరిస్థితి..
కరోనా వైరస్ ప్రజల ప్రాణాలను హరించడమే కాదు... ఆర్థిక వ్యవస్థనూ అతలాకుతలం చేస్తోంది. వైరస్ నియంత్రణకు తీసుకున్న లాక్ డౌన్ చర్యలు ఆర్థిక సంక్షోభానికి దారితీసే సంకేతాలను పంపిస్తున్నాయి. ఇప్పటికే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(IMF) 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ది రేటు దారుణంగా పడిపోయి కేవలం 1.2శాతానికే పరిమితమయ్యే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం భారత్లో ఇది అతిపెద్ద సంక్షోభానికి దారితీయబోతోందని.. నిరుద్యోగం రూపంలో ఇప్పటికే మొదటి వేవ్ మొదలైందని వ్యాఖ్యానించారు. భారత్లో ఇప్పుడు వాస్తవ పరిస్థితులు కూడా అలాగే కనిపిస్తున్నాయి. డిమాండ్ లేకపోవడం.. ఉత్పత్తులు నిలిచిపోవడంతో.. చాలావరకు వస్తు,సేవల కంపెనీలు ఉద్యోగాల్లో కోతలు పెడుతున్నాయి.
ప్రధాని స్వయంగా చెప్పినా.. తప్పని ఉద్యోగాల కోత
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి తన ప్రసంగంలో కంపెనీలకు ఒక విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల పట్ల యాజమాన్యాలు కరుణతో వ్యవహరించాలని.. ఈ సంక్లిష్ట తరుణంలో వారిని ఉద్యోగాల నుంచి తొలగించరాదని పేర్కొన్నారు. కానీ కొన్ని కంపెనీలు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. ప్రముఖ జాతీయ మీడియా కథనం ప్రకారం.. బెంగళూరులోని ఓ కంపెనీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో పనిచేసే మనోజ్(28) అనే యువకుడికి యాజమాన్యం టెర్మినేషన్ లెటర్(ఇకపై నువ్వు మా ఎంప్లాయ్వి కాదని ఇచ్చే నోటీస్) ఇచ్చింది. ఊహించని ఈ పరిణామానికి అతను షాక్ తిన్నాడు. కనీసం ఎలాంటి వివరణ ఇవ్వకుండా యాజమాన్యం చేసిన ఈ పనికి తన భవిష్యత్ అంధకారంలో పడిపోయిందని వాపోయాడు.
బడా కార్పోరేట్ కంపెనీల్లోనూ
గురుగ్రామ్లోని ఓ కంపెనీ సైతం తమ ఉద్యోగులను సెలవులపై పంపించేసింది. వ్యాపార కార్యకలాపాలు 90శాతం మేర పడిపోయాయని.. ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన ఈ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఆచనీరయమైన వ్యూహాలనే సిద్దం చేయడమే ప్రస్తుతం తమ ముందున్న కర్తవ్యం అని ఒక స్టేట్మెంట్లో పేర్కొంది. బడా కార్పోరేట్ కంపెనీల్లోనూ ఇదే తీరు కనిపిస్తోంది. భారత్లో మూడో అతిపెద్ద టూ వీలర్ తయారీ సంస్థ బజాజ్ ఆటో సైతం.. ఏప్రిల్ 21 తర్వాత ఉత్పత్తులు పుంజుకోకపోతే వేతనాల్లో 10శాతం కోత తప్పదని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాన్ని నిలుపుకోవడమే ముఖ్యం కాబట్టి.. అందుకు తాము అంగీకరించినట్టు బజాజ్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ దిలీప్ పవార్ తెలిపారు. విస్తారా కంపెనీ కూడా ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 30 వరకు ఎంప్లాయ్మెంట్ గ్రేడ్స్ను బట్టి 30శాతం ఉద్యోగులకు ఒకటి నుంచి మూడు రోజులకు నో పే లీవ్ను వర్తింపజేసే ఆలోచనలో ఉన్నట్టు వెల్లడించింది.
చిన్న,మధ్య తరహా పరిశ్రమల్లోనూ..
చిన్న,మధ్య తరహా పరిశ్రమల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. చాలా మంది దినసరి కూలీలు స్వస్థలాలకు వెళ్లిపోవడంతో యజమానులు కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.లాక్ డౌన్ పీరియడ్లో వారందరికీ తిండి పెట్టే స్తోమత లేక చేతులెత్తేసిన యజమానులు.. ఇప్పుడు తమ పరిశ్రమలు నడుపుకోవడానికి మినహాయింపునిచ్చినా కార్మికులు లేక ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నారు. కాబట్టి చిన్న పరిశ్రమలకు జీఎస్టీ మినహాయింపు,విద్యుత్ టారిఫ్ల తగ్గింపు వంటి సడలింపులు ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు చాలావరకు చిన్న పరిశ్రమలు లాక్ డౌన్ పీరియడ్లో వేతనాలు చెల్లించలేని స్థితిలో ఉన్నాయి. దీనిపై అహ్మదాబాద్కి చెందిన కిశోర్ మోత్వానీ అనే పారిశ్రామికవేత్త మాట్లాడుతూ.. 'ఏడాదికి రూ.2కోట్లు టర్నోవర్ ఉండే కంపెనీని నేను నిర్వహిస్తున్నాను. ప్రతీ నెలా ఆదాయం దాదాపు రూ.10లక్షల వరకు ఉంటుంది. కానీ లాక్ డౌన్తో ఉత్పత్తి నిలిచిపోయింది. ఇప్పుడు ఉద్యోగులకు వేతనాలు ఎలా చెల్లించాలి..' అని వాపోయాడు.
నిరుద్యోగం మరింత తీవ్రమయ్యే అవకాశం..
లాక్ డౌన్ పీరియడ్లో కార్మికులకు వేతనాలు చెల్లించాల్సిందేనని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చినా.. పంజాబ్లోని లూథియానా పారిశ్రామికవేత్తలు మాత్రం తమవల్ల కాదని చేతులెత్తేశారు. కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించలేమన్నారు. లూథియానాలోని 90శాతం చిన్న తరహా కుటీర పరిశ్రమలే ఉన్నాయని... లాక్ డౌన్ కారణంగా కార్మికులకు చెల్లించేందుకు తమ వద్ద డబ్బు లేదని డిప్యూటీ కమిషనర్ అగర్వాల్కు తెలిపారు. మొత్తం మీద లాక్ డౌన్ కారణంగా ఉత్పత్తి నిలిచిపోవడం.. డిమాండ్ లేకపోవడం.. ప్రజల కొనుగోలు శక్తి కూడా తగ్గిపోవడంతో నిరుద్యోగ సమస్య తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Recommended Video