ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసినా సరే: కంఠంలో ఊపిరి ఉన్నంత వరకూ తల వంచ: మమతా ఫైర్
కోల్ కత: దేశ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ అనే ముద్ర ఏకైక నాయకురాలు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. తన ఫైర్ ఏమిటనేది మరోసారి ప్రదర్శించారామె. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి సారథ్యాన్ని వహిస్తోన్న భారతీయ జనతా పార్టీపై విరుచుకుపడ్డారు. తన రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయబోనని కుండబద్దలు కొట్టారు. పౌరసత్వ సవరణ చట్టం గానీ, పౌర నమోదు (ఎన్ఆర్సీ)ని గానీ అమలు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
ముఖ్యమంత్రిగా ఉండి ఇదేం పద్ధతి: మమతా బెనర్జీపై గవర్నర్ ఆగ్రహం
కోల్ కతలో భారీ ర్యాలీ..
పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర నమోదు కార్యక్రమాలకు నిరసనగా సోమవారం మమతా బెనర్జీ కోల్ కతలో భారీ ప్రదర్శన నిర్వహించారు. వందలాది మంది తృణమూల్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు ఇందులో పాల్గొన్నారు. కోల్ కతలోని రెడ్ రోడ్ లో గల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆరంభమైన ఈ ప్రదర్శన ఠాకూర్ బరి ప్రాంతంలోని జొరాశ్యాంకో వద్ద ముగిసింది. ఈ ర్యాలీ పొడవునా మమతా బెనర్జీ కాలినడకనే కనిపించారు.
ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తారా?. అయినా సరే..
జోరాశ్యాంకో వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మమతా బెనర్జీ ప్రసంగించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని గానీ, జాతీయ పౌర నమోదును గానీ అమలు చేయని రాష్ట్రాల ప్రభుత్వాలను బర్తరఫ్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం బెదిరిస్తోందని ఆరోపించారు. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడేది లేదని, వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అన్నారు. తన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసినా సరే.. తన కంఠం ఊపిరి ఉన్నంత వరకూ పౌరసత్వ సవరణ చట్టాన్ని గానీ, జాతీయ పౌర నమోదు కార్యక్రమాన్ని గానీ అమలు చేయబోనని మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు. కేంద్రానికి తలొంచ బోయే ప్రశ్నే లేదని అన్నారు.
ఎందుకీ మొండి పట్టుదల?
దేశంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తోంది తన ప్రభుత్వం ఒక్కటే కాదని, ఈశాన్యం నుంచి కేరళ దాకా పలు రాష్ట్రాలు దీన్ని నిరసిస్తున్నాయని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం మొండి పట్టుదలకు పోతోందని ధ్వజమెత్తారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయనేది కేంద్రానికి తెలియని విషయం కాదని గుర్తు చేశారు. దేశ రాజధాని సైతం అట్టుడికిపోతోందని చెప్పారు.
తన మృతదేహం మీద..
జాతీయ పౌర నమోదును మొదట్లో తాను మాత్రమే వ్యతిరేకించానని, ఇప్పుడు ఢిల్లీ, బిహార్, పంజాబ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, కేరళ ముఖ్యమంత్రులు తన వెంట నడుస్తున్నారని అన్నారు. తాను ఒంటరిని కానని అన్నారు. పశ్చిమ బెంగాల్ లో సీఏఏ, ఎన్ఆర్సీలను అమలు చేయాల్సిన పరిస్థితే ఎదురైతే తాను ప్రాణత్యాగానికైనా సిద్ధపడతానని, తన భౌతిక కాయం మీదుగా వాటిని అమలు చేసుకోవచ్చని మమతా బెనర్జీ హెచ్చరించారు.