ఆ పేరు వింటే పేదలకు ధైర్యం -పెద్ద రాష్ట్రాలకు పోటీగా ఒడిశా ప్రస్థానం-నవీన్ పట్నాయక్ బర్త్డే స్పెషల్
రాజకీయ ఓనమాలు దిద్దకుండానే డైరెక్టుగా రాజ్యాధినేత అయ్యారు.. అనతికాలంలోనే ఆదివాసీ గిరిజనుల విశ్వాసాన్ని చురగొన్నారు.. రెండు దశాబ్దాలకుపైగా ఒడిశా అనే పేరుకు ప్రత్యామ్నాయంగా.. పేదలకు పెన్నిధిగా.. పెద్ద రాష్ట్రాలకు ధీటుగా ఒడిశాను ప్రగతి పథాన నడుపుతోన్న ఉత్తమ పాలకుడిగా కొనసాగుతున్నారు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. శుక్రవారం 74వ పడిలోకి ప్రవేశించిన ఆయన.. కరోనా పరిస్థితుల కారణంగా వేడుకలకు దూరంగా ఉన్నారు. తండ్రి బిజూ పట్నాయక్ మరణం తర్వాత నాటకీయ పరిణామాల మధ్య రాజకీయాల్లోకి ప్రవేశించిన నవీన్.. ఒడిశాను నవీనీకరిచడంలో తనదైన మార్కుతో సాగుతున్నారిలా..
మొన్న మార్చిలో నవీన్ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రిగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆయన నెలకొల్పిన అనేక రికార్డులలో ఇదీ ఒకటి. ఒడిశాకు ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రి ఆయనే. తన కుటుంబీకులెవరూ రాజకీయాల్లో చేరడం బిజు పట్నాయక్ కు ఇష్టం లేకుండేది. కానీ 1997 లో బిజు మరణం తరువాత జనతాదళ్ కు చెందిన సీనియర్లందరూ కలిసి.. తండ్రి మరణంతో ఖాళీ అయిన ఆక్సా లోక్ సభ స్థానంలో పోటీ చేయడానికి నవీన్ పట్నాయక్ను ఒప్పించారు. కొద్ది నెలల్లోనే జనతాదళ్ నుంచి విడిపోయి 'బిజూ జనతాదళ్(బీజేడీ)' పేరుతో ప్రాంతీయ పార్టీని(1997, డిసెంబర్ 26న) స్థాపించారు నవీన్. తొలినాళ్లలో అన్ని ఎన్నికల్లోనూ బీజేపీతో కలిసి పోటీ చేసిన బీజేడీ.. 2009 నుంచి మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగుతూ విజయపరంపరను కొనసాగించింది.
సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ మచ్చలేని నేతగా, నిజాయితీపరుడిగా పేరుపొందారు నవీన్ పట్నాయక్. ఒడిశా సంస్కర్తగా ఆయన నిర్ణయాలన్నీ ప్రజల జీవితాల్లో మౌళికమైన మార్పులకు సంబంధించినవే కావడం విశేషం. గత ఫిబ్రవరిలో పట్నాయక్ రాష్ట్ర అసెంబ్లీలో ఓబీసీల కోసం కమిషన్ ఏర్పాటు చేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. దీంతో ఓబిసిల సామాజిక, విద్యా పరిస్థితులపై సర్వే నిర్వహించడానికి వీలు ఏర్పడింది. అదేక్రమంలో.. 2021 సాధారణ జనాభా లెక్కలతో పాటు ప్రజల 'సామాజిక-ఆర్థిక కుల గణన' కూడా చేపట్టాలని ఒడిశా సర్కారు కేంద్రాన్ని కోరింది. అదే జరిగే ఓబిసిల ప్రయోజనాల పరిరక్షణకు కీలక అడుగు పడినట్లవుతుంది.
ప్రస్తుతం పట్నాయక్ 'పీపుల్ సెంట్రిక్' ఫార్ములానే ప్రధానంగా పరిపాలన సాగిస్తున్నారు. అంటే, పౌరులే కేంద్రీకృతంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నమాట. తన విధానాల్లో నవీన్ ప్రధానంగా '5టీ'లుగా పేర్కొనే టెక్నాలజీ, ట్రాన్స్ పరెన్సీ, టీమ్ వర్క్, టైమ్, ట్రాన్స్ మిషన్ కు ప్రాముఖ్యం ఇస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రితోపాటు ఆయన అధికారులు సామాన్య ప్రజలకు ఫోన్లు చేసి, వారికి అందుతోన్న ప్రభుత్వ సేవలను అడిగి తెలుసుకుంటారు. ఇందుకోసం పట్నాయక్ తన ప్రైవేట్ కార్యదర్శి వి కె పాండియన్ను కార్యదర్శిగా నియమించారు. ప్రభుత్వ పథకాలు అమలు అయ్యేలా పర్యవేక్షణ చేయడంలో భాగంగా తరచూ ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు.
తన మిస్టర్ క్లీన్ ఇమేజ్ కు తగ్గట్టుగా అవినీతిపై పోరాటంలో పట్నాయక్ ముందుంటారు. ఇటీవల అధికార బీజేడీకి చెందిన కలకండి మాజీ ఎమ్మెల్యేను అక్రమాస్తుల కేసులు అరెస్టు చేయించారు. అవినీతి, లంచాలు తీసుకున్న అధికారులను తొలగించడంతోపాటు వాళ్లకు పెన్షన్లను సైతం నిలిపేయించారు. పదవీకాలంలో ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన అతికొద్ది మంది సీఎంలలో పట్నాయక్ ప్రముఖంగా ఉంటారు. పేద రైతులకు నగదు సాయం అందించేందుకు కాలియా పథకం, పేదలకు రూ.1కే కిలో బియ్యం, పథకం వాటిలో ముఖ్యమైనవి. సహజ వనరులు కేంద్రంగా ఉన్న ఒడిశాలో గనుల వేలంలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నారు. పారదీప్ లో మైనింగ్ వ్యవహరాలకు సంబంధించి పోస్కో సంస్థను పక్కన పెట్టేసి జెఎస్డబ్ల్యుకు అవకాశం కల్పించారు.
దేశంలోని తీర రాష్ట్రాల్లో అతి ఎక్కువగా ప్రకృతి విపత్తులు ఎదుర్కొనేది ఒడిశానే కావడంతో వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో నవీన్ ఏటికేడు వినూత్న ఐడియాలో సాగుతున్నారు. సీఎంగా బాద్యతలు చేపట్టిన మూడేళ్లకే(2000లో) సూపర్ సైక్లోన్ ఒడిశాను ముంచెత్తి వేలమందిని పొట్టనపెట్టుకుంది. నాటి చేదు అనుభవంతో ఎన్నో పాఠాలు నేర్చిన పట్నాయ్.. తర్వాతి కాలంలో తుపాన్లను దీటుగా ఎదుర్కొన్నారు. ప్రకృతి విపత్తుల నిర్వహణలో నవీన్ అంతర్జాతీయంగానూ ప్రశంసలు అందుకున్నారు.
ఆర్థిక వృద్ధి రేటులో జాతీయ సగటు(6.9శాతం) కంటే ఒడిశా(8శాతం) మెరుగైన స్థితిలో ఉంది. కరోనా విపత్తు, ఆర్థిక వ్యవస్థ పతనం అయిన 2019-20లోనూ ఒడిశా 6.16 శాతం వృద్ధిరేటుతో జాతీయ సగటు(5 శాతం) కంటే ముందుంది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. 2019లో భారత్ కు కొత్తగా వచ్చిన పెట్టుబడుల్లో ఏకంగా 18 శాతం ఒక్క ఒడిశాకే తరలివెళ్లాయి. పెట్టుబడుల గమ్యస్థానంగా ఒడిశా నిలిచిందని CMIE డేటా పేర్కొంది. పారిశ్రామికంగానే కాదు.. 2020-21 ఏడాదికిగానూ వ్యవసాయ రంగంలో ఒడిశా 4.5 శాతం వృద్ధిని సాధించింది. ఇది జాతీయ సగటు 3.1 శాతం కంటే ఎక్కువ. కేంద్రం ప్రకటించే కృషి కర్మన్ అవార్డులను ఒడిశా ఇప్పటికే ఐదు సార్లు గెలుచుకుంది.
ఆరోగ్య రంగాన్ని బాగు చేసుకోవడంలో భాగంగా నవీన్ పట్నాయక్ సర్కారు కొత్తగా నాలుగు మెడికల్ కాలేజీలను కూడా ఏర్పాటు చేసింది. మరో ఏడు కాలేజీల స్థాపనకు కూడా రంగం సిద్ధమైంది. ఢిల్లీ తర్వాత తొలిగా భువనేశ్వర్లోనే ఎయిమ్స్ ను స్థాపించారు. దశాబ్దాలుగా వైద్యసేవలు అందించిన ఎస్సిబి మెడికల్ కాలేజీని రూ.1000 కోట్లతో ఎయిమ్స్ ప్లస్ ఇంటిగ్రేటెడ్ వైద్య సంస్థగా మార్చాలని అభివృద్ధి చేస్తున్నారు. మార్చి 5 న పట్నాయక్ దీనికి శంకుస్థాపన చేశారు. వచ్చే నాలుగేళ్లలో గ్రామీణ పేదలకు కొత్తగా 20 లక్షల పక్కా ఇళ్లు నిర్మిస్తామని మార్చిలో పట్నాయక్ ప్రకటించారు. గత 20 ఏళ్లలో బీజేడీ నిర్మించిన ఇళ్ల సంఖ్య 25లక్షలుగా ఉంది.
భువనేశ్వర్ లోని కళింగ స్టేడియంలో హాకీ ప్రపంచ కప్ -2018ను విజయవంతంగా నిర్వహించి, ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాల కల్పనలోనూ ఒడిశా తీసిపోదని నవీన్ చాటుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం(మార్చి 8) నాడు.. స్వయం సహాయక బృందాల కోసం కొత్త విభాగం మిషన్ శక్తిని ఏర్పాటు చేస్తున్నట్లు నవీన్ చేసిన ప్రకటనే ఎన్నికల్లో ఆయనకు మహిళల ఓట్లు పడేందుకు కారణమైందని చెబుతారు. కొవిడ్-19 వ్యతిరేక పోరాటంలో ఒడిశా ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రశంసించింది. పంచాయతీ రాజ్ సంస్థల సహకారంతో, ప్రజల భాగస్వామ్యంతో సమాజ-ఆధారిత ప్రతిస్పందన వ్యూహం ద్వారా ఒడిశా కరోనాను కంట్రోల్ చేయగలిగిందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.
Recommended Video
ప్రఖ్యాత సి-ఓటర్ సర్వే సంస్థ మొన్న జూన్ లో ''స్టేట్ ఆఫ్ ది నేషన్ 2020'' పేరుతో నిర్వహించిన సర్వేలో నవీన్ పట్నాయక్.. దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రిగా నిలిచారు. ఆదివాసీ గిరిజనులు ఎక్కువగా ఉండే ఒడిశాలో నవీన్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ ప్రజల జీవితాల్లో మౌలికమైన మార్పులు తెచ్చేందుకు ఉపకరించేవే కావడం గమనార్హం. ప్రజల ఆశీర్వాదంతో ప్రజాస్వామ్య పద్ధతిలో కళింగ రాజ్యాన్ని పాలిస్తోన్న నవీన్ పట్నాయక్ కు ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు.