కర్ణాటక ప్రభుత్వానికి గవర్నర్ ఝలక్ ? చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు, కేంద్ర హోం శాఖకు నివేదిక !
బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో ప్రతినిత్యం చేటుచేసుకుంటున్న పరిణామాల గురించి ఆ రాష్ట్ర గవర్నర్ వాజుబాయ్ వాలా ఎప్పటికప్పుడు కేంద్ర హోం శాఖ కార్యాలయానికి సమాచారం ఇస్తున్నారని తెలిసింది. గవర్నర్ వాజుబాయ్ వాలా కర్ణాటక చీఫ్ సెక్రటరీ టీఎం. విజయ్ భాస్కర్ కు పలు ఆదేశాలు జారీ చేసి సీఎం కుమారస్వామికి ఝలక్ ఇచ్చారని మీడియాలో వార్తలు ప్రసారం అయ్యాయి.
రాజ్ భవన్ కు నివేదిక
అత్యవసరంగా చేపట్టాల్సిన పనుల గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని, ఆలస్యం చెయ్యకుండా ఆ వివరాల నివేదిక రాజ్ భవన్ కు పంపించాలని గవర్నర్ వాజుబాయ్ వాలా చీఫ్ సెక్రటరీ టీఎం. విజయ్ భాస్కర్ కు సూచించారని సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదని గవర్నర్ వాజుబాయ్ వాలా చీఫ్ సెక్రటరీ టీఎం. విజయ్ భాస్కర్ కు సూచించారని తెలిసింది.
భారీ నిధులు మంజూరు !
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలాంటి కొత్త పథకాలకు భారీ నిధులు మంజూరు చెయ్యకూడదని, ముఖ్యమంత్రి, మంత్రులు అత్యవసర సమావేశాలు నిర్వహించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదని గవర్నర్ వాజుబాయ్ వాలా సూచించారని కన్నడ మీడియాలో వార్తలు ప్రసారం అయ్యాయి.
మైనారిటీలో ప్రభుత్వం
సంకీర్ణ ప్రభుత్వంలోని 13 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే రాజీనామా చేశారు. 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చెయ్యడంతో ఈ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భంలో ప్రముఖ నిర్ణయాలు తీసుకుని వెంటనే నిధులు మంజూరు చెయ్యకూడదని గవర్నర్ వాజుబాయ్ వాలా చీఫ్ సెక్రటరీ టీఎం. విజయ్ భాస్కర్ కు సూచించారు.
సీఎం కుమారస్వామికి షాక్
ముఖ్యమంత్రి కుమారస్వామి అధికార నివాసం కృష్ణలో మంగళవారం భారీ నీటిపారుదల శాఖకు సంబంధించి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం కుమారస్వామి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి డీకే. శివకుమార్, శాసన సభ్యులు, అధికారులు పాల్గొని చర్చించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త పథకాలు ప్రారంభించడానికి భారీ నిధులు మంజూరు చెయ్యకూడదని ఆదేశాలు జారీ చేసిన గవర్నర్ సీఎం కుమారస్వామికి షాక్ ఇచ్చారు.
గవర్నర్ ఆదేశాలు
అత్యవసర సమావేశాలు నిర్వహించి భారీ మొత్తంలో నిధులు కేటాయించరాదని గవర్నర్ వాజుబాయ్ వాలా చీఫ్ సెక్రటరీ టీఎం. విజయ్ భాస్కర్ కు ఆదేశాలు జారీ చేశారని తెలిసింది. గవర్నర్ ఆదేశాలతో సంకీర్ణ ప్రభుత్వంలో ఎలాంటి పథకాలకు భారీ మొత్తంలో నిధులు కేటాయించడానికి వీలులేకుండా పోయిందని న్యాయనిపులుణలు అంటున్నారు.