కాంగ్రెస్-బీజేపీలకు షాక్, కేసీఆర్ ఫ్రంట్కు మమత దన్ను, దాదా వెనుక దీదీ: ప్రధాని అభ్యర్థిగా ప్రణబ్?
న్యూఢిల్లీ: రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతాయో ఎవరూ ఊహించలేరు. అలాంటిదే 2019 ఎన్నికలకు ముందు జరగనుందా? కాంగ్రెస్సేతర, బీజేపీయేతర కూటమికి ప్రధాని అభ్యర్థిగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేరు తెరపైకి రానుందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రణబ్ మూడో ఫ్రంట్ కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా బరిలోగి దిగవచ్చుననే ప్రచారం సాగుతోంది.
చదవండి: ఆరెస్సెస్ సమావేశానికి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ అసంతృప్తి: ఇందిరాగాంధీ-నెహ్రూల మాటేమిటి?
కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు చూస్తే అలాగే కనిపిస్తోందని అంటున్నారు. ప్రణబ్ ఆరెస్సెస్ సమావేశానికి హాజరుకానున్నారనే అంశం సంచలనంగా మారింది. ఆరెస్సెస్ అధినేత మోహన్ భగత్ పంపిన ఆహ్వానాన్ని ప్రణబ్ అంగీకరించినప్పుడే ఏదో జరగబోతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ప్రాంతీయ పార్టీల ప్రధానిగా ప్రణబ్ ముఖర్జీ!
ప్రణబ్ అయిదు దశాబ్దాలుగా కాంగ్రెస్లో ఉన్నారు. పార్టీ అగ్రనేత. ఆ తర్వాత రాష్ట్రపతి అయి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు 2019లో కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి, వచ్చే ఎన్నికల్లో ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయడంలో ప్రణబ్ కీలక పాత్ర పోషించే అవకాశాలు కొట్టి పారేయలేమని ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల ప్రధాని అభ్యర్థిగా అయ్యే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు.
ఆ భేటీలో అద్వానీ, ప్రణబ్
ఆరెస్సెస్ సమావేశానికి వెళ్లేందుకు సుముఖత చూపడం ద్వారా తాను క్రియాశీల రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలగలేదనే సంకేతాలు ప్రణబ్ పంపించారని అంటున్నారు. రాజాజీ మార్గ్లోని తన నివాసంలో ప్రణబ్ పలువురు రాజకీయ నాయకులతో సమావేశమవుతున్నారట. ఈ ఏడాది జనవరిలో భువనేశ్వర్లో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నివాసంలో ఎలాంటి ఆర్భాటం లేకుండా జరిగిన భేటీ నుంచి ఇవి కొనసాగుతున్నాయట. ఆ భేటీకి జేడీ(ఎస్) అధినేత దేవెగౌడ, సీపీఎం నేత సీతారాం ఏచూరి, బీజేపీ అగ్రనేత అద్వానీ కూడా హాజరయ్యారు.
మోడీకి సరితూగే వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ మాత్రమేనంటూ
మూడో కూటమికి ఆ రోజే బీజం పడిందని అంటున్నారు. ప్రణబ్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు గత ఏడాది రాష్ట్రపతి భవన్లో నవీన్తో విందులో పాల్గొన్నారు. ఆ రోజు అక్కడి నుంచి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో మాట్లాడారు. ప్రధాని మోడీ స్థాయికి సరితూగే ఏకైక వ్యక్తి ప్రణబ్ మాత్రమేననీ, ఎన్డీఏయేతర కూటమిలో కీలకపాత్ర పోషించేందుకు ఆయన సిద్ధంగానే ఉన్నారని చెబుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
కేసీఆర్కు మమత దన్ను, ఆమె వెనుక ప్రణబ్?
2004లో తనకు ప్రధాని పదవి వస్తుందని ప్రణబ్ భావించారు. కానీ సోనియా గాంధీ మాత్రం మన్మోహన్ సింగ్ను ఎంచుకున్నారు. కానీ నాటి నిర్ణయంతో ప్రణబ్ నిరుత్సాహానికి గురయ్యారు. ఈ విషయాన్ని ఆయన తన పుస్తకంలో రాసుకున్నారు. ఇందిరా గాంధీ హత్య తర్వాత, ఆ తర్వాత 2004లో ప్రణబ్ పేరు వచ్చింది. కానీ ఆయనకు రెండుసార్లు నిరాశ ఎదురైంది. ప్రణబ్కు మమతతో మంచి సంబంధాలు ఉన్నాయి. 2012లో ఆయనను రాష్ట్రపతిగా ప్రతిపాదించగా మమత ముందుకు వచ్చి, మద్దతు కూడగట్టారు. ఇప్పుడు కేసీఆర్ చేస్తున్న థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలకు మమత మద్తతిస్తున్నారు. ఆమె వెనుక ప్రణబ్ ఉండవచ్చునని అంటున్నారు.ఇవన్నీ ముందు ముందు తేలనున్నాయి.