డిమాండ్ పెరిగింది!: 700కేజీల ఉల్లి దోచేశారు
ముంబై: గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ఉల్లి గడ్డ ధరలు అమాంతం పెరిగి పోయాయి. ఈ నేపథ్యంలో దొంగలు కూడా తమ రూటు మార్చారు. ఇప్పటి వరకు డబ్బులు, బంగారం దోచుకున్న దొంగలు.. ఇప్పుడు పెరిగిన ధరలతో ఉల్లిగడ్డలపై పడ్డారు.
మహారాష్ట్రలోని ముంబైలో ఏకంగా 700కిలోల ఉల్లిగడ్డలను దొంగిలించారు. స్థానిక వడాలా ప్రాంతంలోని ప్రతీక్ష నగర్లో అనంత్ నాయక్ అనే వ్యక్తి దుకాణం నుంచి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు 700 కిలోల ఉల్లిగడ్డలను దొంగలించారు.
శుక్రవారం రాత్రి షాపునకు తాళం వేసుకుని వెళ్ళి, శనివారం ఉదయం వచ్చి చూసేసరికి సరకు అపహరణకు గురవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. చోరీకి గురైన ఉల్లిగడ్డల విలువ సుమారు రూ. 50వేల వరకు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
షాప్ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ప్రస్తుతం దేశంలో కిలో ఉల్లి ధర రూ. 80పైనే పలుకుతుంది. ముంబై మార్కెట్లో మాత్రం కిలో ఉల్లి ధర రూ. 65గా ఉంది. ఢిల్లీలో అయితే రూ. 75 నుంచి రూ. 80 మధ్య ఉంది.