ఆపరేషన్ కమలం: మహారాష్ట్ర.. మరో కర్ణాటక అవుతుందా? శరద్ పవార్ ఆందోళనకు కారణాలేంటీ?
ముంబై: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. శతృవులు మిత్రులయ్యారు.. మిత్రులు శతృవులయ్యారు. మహారాష్ట్రలో అయిదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం ఒంటరిగా మిగిలింది. బీజేపీతో సుమారు మూడు దశాబ్దాల పాటు కొనసాగిన స్నేహ బంధాన్ని తెంచుకుంది శివసేన. ఇన్నేళ్లుగా కలిసి ఉన్నప్పటికీ.. తమకు రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిని వదిలి వేయలేదనే ఆక్రోశం శివసేన నాయకుల్లో నెలకొంది. అదే ఈ తెగదెంపులకు కారణమైంది.
President's rule: షాకింగ్ ట్విస్ట్: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు: గడువు దాటిన మరుక్షణమే..
ఈ బ్రేకప్ వల్ల అధికారానికి దూరమైన కమలం..
శివసేన బ్రేకప్ చెప్పడంతో వరుసగా రెండోసారి అధికారాన్ని అందుకోలేకపోయింది బీజేపీ. మిత్రపక్షం ప్రతిపాదించిన 50-50 ఫార్ములాను అంగీకరించి ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదనడంలో సందేహాలు అనవసరం. హర్యానా తరహాలో ఈ పాటికి మహారాష్ట్రలోో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటై ఉండేది. పాలన గాడిలో పడి ఉండేది. అయిదేళ్ల పాటు తామే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతామని, మిత్రపక్షమైనప్పటికీ.. శివసేప ప్రయోజనాలు, అకాంక్షలను తాము నెరవేర్చలేమని బీజేపీ తేల్చేయడంతో అసలు చిక్కంతా వచ్చి పడింది.
అయినా బీజేపీ ఊరుకుంటుందా?
శివసేన సారథ్యంలో కాంగ్రెస్-ఎన్సీపీలు కలిసి మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగితే.. బీజేపీ చూస్తూ ఊరుకుంటుందా? అనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిర పరిచి, కుప్పకూల్చడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చనే వాదనలూ లేకపోలేదు. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. అందులో ఒకటి- కర్ణాటక. హంగ్ అసెంబ్లీ ఏర్పడిన కర్ణాటకలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన బీజేపీకి అధికారాన్ని దక్కకుండా చేయడానికి కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) కూటమి కట్టాయి. తమ కూటమి తరఫున హెచ్ డీ కుమారస్వామిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాయి.
ఆపరేషన్ లోటస్..
కర్ణాటకలో ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి బీజేపీ నాయకులు ఆపరేషన్ లోటస్ కు తెర తీశారు. బతిమాలో, బెదిరించో, డబ్బులు ఆశచూపో.. కారణాలేమైనప్పటికీ.. అధికార కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో ముసలం పుట్టించ గలిగారు. తిరుగుబాటుకు కారణం అయ్యారు. ఏకంగా 18 మందితో రాజీనామా చేయించారు. దీని ఫలితంగా ఏమిటనేది తెలిసిందే. సరిగ్గా 14 నెలల వ్యవధిలో కుప్పకూలిపోయింది కాంగ్రెస్-జేడీఎస్ సర్కార్. అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవడానికి ముందే ముఖ్యమంత్రి కుమారస్వామి తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వం కుప్పకూలింది. ఆ వెంటనే- బీఎస్ యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది బీజేపీ.
అదే పరిస్థితి మహారాష్ట్రలో కూడా..
అదే పరిస్థితి మహారాష్ట్రలో కూడా తలెత్తే ప్రమాదం ఉందనే అనుమానాలు ఎన్సీపీ నాయకుల్లో వ్యక్తమౌతున్నాయి. బయటి నుంచి కాంగ్రెస్ పార్టీ మద్దతును తీసుకుని.. శివసేనతో కలిసి ఎన్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. అది ఎన్నిరోజులు కొనసాగుతుందనే అనుమానాలు వారిని పట్టి పీడిస్తున్నాయి. అపార రాజకీయ అనుభవం ఉన్న శరద్ పవార్ సైతం.. ఈ కోణాన్ని దృష్టిలో ఉంచుకునే శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వెనుకాడుతున్నారని అంటున్నారు. కొందరు సన్నిహితుల వద్ద కూడా శరద్ పవార్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
రెంటికీ చెడే ప్రమాదం..
సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిర పర్చడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని, కర్ణాటక, గోవాల్లో ఇదే పరిస్థితి తలెత్తిందనే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ కారణం వల్లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం వచ్చినప్పటికీ.. దాన్ని అందకోవడానికి ఎన్సీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారని, ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారని చెబుతున్నారు. ఒకసారి శివసేనతో చేతులు కలిపిన తరువాత.. లౌకికవాద పార్టీ అనే ముద్ర చెరిగిపోయే ప్రమాదం ఉందని, దళితులు, మైనారిటీ ఓటు బ్యాంకును చేతులారా పోగొట్టుకున్నట్టు అవుతుందనే ఆందోళన ఎన్సీపీలో నెలకొన్నట్లు తెలుస్తోంది.