గతంలో సోనియాకు వారే అండ- ఇప్పుడు వారే సమస్య- పరాకాష్టకు కాంగ్రెస్ రాజకీయాలు..
మన దేశంలో నూట పాతికేళ్ల పైబడిన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ సొంత పార్టీ నేతలే బలం, బలహీనత కూడా. ఒకప్పుడు నెహ్రూ, ఇందిర, రాజీవ్ వంటి నేతల ఛరిష్మాతో నెట్టుకొచ్చిన ఆ పార్టీకి ఆ తర్వాత ఆ స్ధాయి ప్రజాకర్షక నేతలే కరువయ్యారు. గత శతాబ్దం చివర్లో కాంగ్రెస్ పార్టీకి ఏకైక పెద్ద దిక్కుగా కనిపించిన సోనియావైపే మొగ్గుచూపిన నేతలు ఇప్పుడు ఆ పార్టీ దుస్ధితికి ఆమెనే నిందించడం మొదలుపెట్టే పరిస్ధితికి వచ్చారు. దీంతో ఏం చేయాలో తెలియక సోనియా వేదన చెందుతున్నారు. దీన్ని చూడలేక వారిపై ఏకంగా ఆమె కుమారుడు రాహుల్ గాంధీ కస్సుమనే దాకా వ్యవహారం వచ్చేసింది.
Recommended Video
అప్పుడు వారే అండ, ఇప్పుడు వారే బలహీనత...
దేశంలోని రాజకీయ పార్టీలకు ఒకప్పుడు పాఠాలు నేర్పించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నాయకత్వ లేమితో సతమతం అవుతోంది. దీనికి కర్ణుడి చావుకి ఉన్నట్లుగానే సవాలక్ష కారణాలున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి ఉత్ఖాన పతనాలు కొత్తేమీ కాదు. గతంలో 1998లో గత శతాబ్దంలోనే చివరి సారిగా అధికారం కోల్పోయినప్పుడు పార్టీ పరివర్తన చెందాల్సిన అవసరం కనిపించింది. దీంతో తానే స్వయంగా రంగంలోకి దిగిన సోనియాగాంధీ.. సీనియర్ల సాయంతో పార్టీని గట్టెక్కించారు. 2004లో కాంగ్రెస్ పార్టీ యూపీఏ రూపంలో కేంద్రంలో అధికారం చేపట్టడం వెనుక ఉన్నది ఆమే. బీజేపీ అభ్యంతరాలతో ప్రధాని అయ్యేందుకు అవకాశం రాకపోయినా ఓ పదేళ్ల పాటు సోనియాగాంధీ బలమైన రాజకీయ నేతగా ప్రపంచం దృష్టిని సైతం ఆకర్షించారు. ఆ తర్వాత షరా మామూలే. కానీ 1998లో అధికారం కోల్పోయిన తర్వాత ఆమెకు అండగా నిలిచిన నేతలు ఇప్పుడు ఆమెకే సవాళ్లు విసురుతుండటం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం.
సీనియర్ల లేఖల వెనుక...
కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితులు, అందుకు నాయకత్వం బాధ్యత వంటి అంశాలను కారణంగా చూపుతూ 23 మంది పార్టీ సీనియర్లు తాజాగా అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాశారు. ఇందులో చాలా వరకూ గతంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కోసం సోనియాకు అండగా నిలబడిన వారే. కానీ ఇప్పుడు వీరంతా సోనియా నాయకత్వాన్నే ప్రశ్నిస్తూ మార్పు కోసం చర్యలు తీసుకోవాలని ఏకంగా ఆమెకే సలహాలు ఇచ్చే పరిస్ధితికి వచ్చేశారు. తద్వారా సోనియా ఇక చాలు, మాలో ఎవరో ఒకరికి అవకాశం ఇవ్వండంటూ నేరుగా ఆమెకే సవాలు విసరడం అన్నమాట. దీంతో సహజంగానే అనారోగ్యంతో బాధపడుతున్న సోనియాతో పాటు ఆమె కుమారుడు రాహుల్ గాంధీకి కూడా మంటపుట్టింది. క్లిష్ల సమయంలో గాంధీ కుటుంబానికి అండగా ఉండాల్సిన వారు ఇప్పుడు పార్టీ పెద్ద దిక్కుపైనే సమరశంఖం పూరించడంపై రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు.
రాహుల్ వ్యాఖ్యల కలకలం..
గతంలో పార్టీకి, తన తల్లి సోనియా నాయకత్వానికి, పార్టీలో పరివర్తనకు అండగా నిలబడిన సీనియర్లు ఇప్పుడు ఏకంగా సోనియా గాంధీకి సవాళ్లు విసురుతూ లేఖలు రాయడంపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అందుకే సీడబ్ల్యూసీ సమావేశం పెట్టి మరీ వారిని కడిగేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే మీరంతా బీజేపీ ఏజెంట్లు అన్నంతగా రాహుల్ వారిపై సీడబ్ల్యూసీ సమావేశంలోనే విరుచుకుపడ్డారు. దీంతో మనస్తాపం చెందిన గులాం నబీ అజాద్, కపిల్ సిబల్ వంటి కొందరు నేతలు రాజీనామాలకు సైతం సిద్ధపడ్డారు. కానీ వారు రాజీనామాలకు చివరి దాకా కట్టుబడతారా అంటే అదీ లేదు. ఊరికే బెదిరింపులకు దిగిన వీరు, ఆ తర్వాత రాహుల్ ఆగ్రహం గమనించి వెనక్కి తగ్గారు. అయితే ఇలా ఎప్పటివరకూ వీరిని కట్టేసి ఉంచగలం అన్న ప్రశ్న ఇప్పుడు రాహుల్కు ఎదురవుతోంది..
విదేశీ అనుభవాల వాస్తవం...
మన దేశంలో కాంగ్రెస్ పార్టీయే కాదు విదేశాల్లో సైతం శతాధిక చరిత్ర కలిగిన పార్టీలన్నీ ఇలాంటి సవాళ్లు ఎదుర్కొన్నవే. ఉదాహరణకు చైనా కమ్యూనిస్టు పార్టీ గత వందేళ్ల కాలంలో ఇలాంటి సవాళ్లెన్నో ఎదుర్కొంది. బ్రిటన్లోనూ దశాబ్దాల పాటు టోరీల ఆధిపత్యంలో సాగిన లేబర్ పార్టీ టోనీ బ్లెయర్ ఆధ్వర్యంలో తిరిగి పుంజుకుంది. ప్రస్తుతం వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ ఓటములతో కుదేలైన కాంగ్రెస్ పార్టీ కూడా తిరిగి పుంజుకునేందుకు అవసరమైన మార్పులు చేర్పులు చేసుకుంటే సరిపోతుంది. అలా కాదని కేవలం గాంధీ కుటుంబంపైనో, సోనియా నాయకత్వంపైనో ఆధారపడటమో, తమకు అనుకూలంగా లేదని అన్నింటికీ వారినే బాధ్యులుగా చూడటమో చేయడం సరికాదనే వాదన వినిపిస్తోంది. అన్నింటికీ మించి గతంలో తాము పార్టీలో అనుభవించిన కీలక పదవులను పిలిచి కట్టబెట్టింది కూడా ఈ సోనియా గాంధీనే అన్న చేదు నిజాన్ని కూడా పార్టీ సీనియర్లు గుర్తించాల్సిన తరుణం వచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.