తాజ్ మహల్ రీఓపెన్: తొలి సందర్శకుడు చైనీయుడే! 188 రోజుల తర్వాత సందర్శకుల సందడి
లక్నో: ఈ ఏడాది మార్చి నెల కరోనావైరస్ కట్టడి కోసం దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా పూర్తిగా స్థంభించిపోవడం, ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తున్న నేపథ్యంలో మే నెల నుంచి దశలవారీగా అన్లాక్ చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం (సెప్టెంబర్ 21) ఆగ్రాలోని తాజ్ మహల్కు సందర్శకులకు అనుమతిచ్చారు.
తాజ్ తొలి సందర్శకుడు చైనీయుడే..
కాగా, తిరిగి తెరుచుకున్న తర్వాత తాజ్ మహల్ను సందర్శించిన తొలి వ్యక్తి చైనీయుడు కావడం గమనార్హం. సోమవారం ఉదయం 5.39 గంటలకు లియాంగ్ చియిాచెంగ్ అనే చైనీయుడు తన కుటుంబంతో తాజ్ మహల్ను సందర్శించాడు. సుమారు ఆరు నెలల తర్వాత 17వ శతాబ్దం నాటి ఈ కట్టడం సందర్శనకు భారీ ఎత్తున సందర్శకులు వచ్చారు.
తొలి రోజు తాజ్ సందర్శకులు ఎంతమందంటే..
కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ.. సోమవారం సందర్శనకు భారీగా పర్యాటకులు, సందర్శకులు వచ్చారు. అయితే, కరోనాకు ముందు రోజుకు 20వేల నుంచి 40వేల వరకు సందర్శకులు వచ్చేవారు. సోమవారం మాత్రం తొలి రోజు కావడంతో 5వేల సందర్శకులను మాత్రమే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) అధికారులు అనుమతిచ్చారు. వీరిని రెండు వితలుగా అనుమతించారు. మొత్తం మంది సందర్శకుల్లో 20 మంది విదేశీయులు కూడా ఉన్నారు.
188 రోజుల తర్వాత తాజ్ రీఓపెన్.. పరిస్థితి ఇలా..
తక్కువ మంది ఉండటంతో సందర్శకులు కూడా ఎంతో ఉల్లాసంగా అక్కడ తమ సమయాన్ని గడిపారు. తాజ్ మహల్ను సందర్శించేందుకు వచ్చిన వారందరూ మాస్కులు ధరించేవచ్చారు. సుమారు 188 రోజుల తర్వాత తాజ్ మహల్ ప్రాంతమంతా సందర్వకులతో సందడిగా మారింది. ఇక మరికొద్ది రోజులకు సాధారణంగా మారే అవకాశం ఉంది. స్థానిక వ్యాపారులు కూడా సందర్శకులకు అనుమతివ్వడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజ్ మహల్ వద్ద సందర్శకులు సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటూ కనిపించారు. కాగా, సందర్శకుల్లో ఎక్కువ మంది ఆగ్రాకు చెందిన యువతీ యువకులే ఉన్నారు. కరోనా నిబంధనలు పాటించాలంటూ ఆ ప్రాంతంలో పోలీసుల హెచ్చరికలకు సంబంధించిన నోటీసులు కూడా ఉన్నాయి.
Recommended Video
సందర్శకుల్లో ఆ రష్యన్ కూడా.. తాజ్కు లాక్డౌన్ నష్టం ఎంతంటే..?
లాక్డౌన్ కారణంగా మనదేశంలోనే ఉండిపోయిన ఓ రష్యన్ కూడా ఈ అద్భుత కట్టడాన్ని సందర్శించారు. అంతర్జాతీయ విమానాలు ప్రారంభం కాగానే తాను తన దేశానికి వెళ్లాలని అనుకున్నానని, కానీ ఇప్పుడు తాజ్ మహల్ సందర్శించిన తర్వాతే వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. ఆరు నెలల కాలంగా తాజ్ మహల్ సందర్శన నిలిచిపోవడంతో సుమారు రూ. 35 కోట్ల ఆదాయం కోల్పోయామని ఏఎస్ఐ అధికారులు తెలిపారు. ఆగ్ర సర్కిల్ ఏఎస్ఐ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ వసంత్ స్వర్ణకార్ మాట్లాడుతూ.. తొలి రోజైన సోమవారం కేవలం 5వేల మంది సందర్శకులు మాత్రమే వచ్చారని తెలిపారు. 20-25శాతం టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయని పేర్కొన్నారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎక్కువ మందిని కూడా అనుమతించే పరిస్థితి లేదన్నారు.