బీజేపీలోకి వీరప్పన్ కూతురు.. తమిళనాడులో కాషాయదళం స్కెచ్ ఇదే..
దివంగత స్మగ్లర్ వీరప్పన్ కూతురు విద్యారాణి(30) చేరిక తర్వాత తమిళనాడు బీజేపీకి కొత్త ఊపొచ్చింది. ఆమె క్రేజ్ ద్వారా వీలైనంత మేరకు పార్టీని బలోపేతం చేయాలని రాష్ట్ర నేతలు నిర్ణయించారు. ఆమేరకు వీరప్పన్ కూతురు కేంద్రంగా భారీ ప్రణాలికలు సిద్ధం చేశారు. వన్నియార్ కులానికి చెందిన వీరప్పన్ కు తొలి నుంచీ సొంత కులంలో చాలా ఫాలోయింగ్ ఉంది. తమిళనాడులో మొత్తం జనాభాలో వన్నియార్లు అత్యధికంగా 12 నుంచి 15 శాతం ఉన్నారు. వీరప్పన్ లాగే అతని కూతురిని కూడా వన్నియార్లు ఆదరిస్తారని బీజేపీ భావిస్తోంది.
అందుకే చేర్చుకున్నాం..
తమిళనాడు జనాభాలో మెజార్టీ వర్గంమైన వన్నియార్లను ఆకట్టుకోడానికే వీరప్పన్ కూతురు విద్యారాణిని బీజేపీలో చేర్చుకున్నట్లు ఆ పార్టీ నేతలు బాహాటంగా ఒప్పుకున్నారు. బీజేపీ తన హిందూత్వ ఎత్తుగడతో మిగతా రాష్ట్రాల్లో బలపడుతున్నప్పటికీ, తమిళనాడులో మాత్రం ఆ ఫార్ములా పనికిరాదని, ద్రవిడ ఉద్యమ పంథాలోనే విస్తరించాలనుకుంటున్నామని, కాబట్టే ఓబీసీలైన వన్నియార్లతోపాటు దళితులు, ముస్లింలను కూడా కలుపుకొని పోయేలా ప్రణాళికలు రెడీ చేశామని నేతలు వివరించారు.
పీఎంకేకు చెక్ పెడుతూ..
రాష్ట్ర రాజకీయాలపై బలమైన ప్రభావం చూపగల వన్నియార్లు.. ఉత్తర తమిళనాడులోని కొన్ని జిల్లాలో అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నారు. కులం ఓట్లే బలంగా వన్నియార్ల ముఖ్యనేత ఎస్.రాందాస్ 1989లోనే పీఎంకే పార్టీని నెలకొల్పారు. ప్రస్తుతం ఆ పార్టీ అధికార ఏఐఏడీఎంకేకు మిత్రపక్షంగా కొనసాగుతున్నది. మరోవైపు ఏఐఏడీఎంకే.. నేరుగా బీజేపీకి మద్దతిస్తున్నది. బీజేపీతో కలిసి పనిచేసే అంశంపై పీఎంకే వెంటనే తేల్చుకోలేకపోతున్నది. దీన్నొక అవకాశంగా వాడుకుని, వన్నియార్ కులానికి చెందిన వీరప్పన్ కూతురి ద్వారా రాష్ట్రంలో బలపడొచ్చని బీజేపీ భావిస్తున్నది.
అసెంబ్లీ ఎన్నికల బరిలోకి..
వీరప్పన్ కూతురు విద్యారాణిని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దింపాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలిసింది. బీజేపీకి మద్దతిచ్చే విషయంలో అన్నాడీఎంకేకు ఉన్నంత క్లారిటీ పీఎంకేకి లేదు. దీంతో వన్నియార్ల ప్రతినిధిగా విద్యారాణిని ప్రొజెక్ట్ చేసి లబ్ధిపొందాలని బీజేపీ స్కెచ్ వేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే అన్నాడీఎంకే ఒత్తిడి మేరకు ఒకవేళ మూడు పార్టీలూ కలిసే పోటీచేస్తే విద్యారాణి గెలుపు మరింత సులువు అవుతుంది. నవంబర్ లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.
వీరప్పన్ గురించి విద్యారాణి ఏమందంటే..
తండ్రి వీరప్పన్ చనిపోయిన తర్వాత కష్టపడి చదువుకున్న విద్యారాణి.. అడ్వొకేట్ గా ప్రాక్టీస్ చేస్తూనే స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటుంది. తల్లి ముత్తులక్ష్మీని ఎదిరించిమరీ 2011లో హైకోర్టు అనుమతితో దీపక్ అనే వ్యక్తిని పెళ్లిచేసుకుంది. గతవారం క్రిష్ణగిరి జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో తమిళనాడు బీజేపీ ఇన్ చార్జి మురళీధర్ రావు సమక్షంలో విద్యారాణి తన 3వేల మంది అనుచరులతో బీజేపీలో చేరింది. వీరప్పన్ ఎంచుకున్నది తప్పుడు మార్గమైనప్పటికీ, పేదలకు చాలా మేలు చేశారని, బీజేపీలో చేరడం ద్వారా ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళతానని విద్యారాని అన్నారు.