బీహార్లో మాకు ఓవైసీ సాయం- బెంగాల్, యూపీల్లోనూ సేమ్ రిపీట్ - సీక్రెట్ చెప్పేసిన బీజేపీ నేత
కొన్నేళ్లుగా ఉత్తరాది రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమకు బలం లేకపోయినా బరిలోకి దిగుతూ బీజేపీకి లబ్ధి చేకూరుస్తూ, లౌకికపార్టీలకు నష్టం చేస్తున్నారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీనిపై ఇన్నేళ్లుగా బీజేపీ కానీ ఎంఐఎం కానీ స్పందించకపోవడంతో ఈ ఆనుమానాలు బలపడుతూ వచ్చాయి. తాజాగా యూపీలోని ఉన్నవ్ బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ ఇదే విషయాన్ని బయటపెట్టేశారు. అంతే కాదు భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో సైతం ఆయన బీజేపీకి సాయం చేస్తారంటూ సాక్షి మహరాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
బీహార్లో బీజేపీకి ఓవైసీ సాయం
బీహార్ అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం ఐదు స్దానాలు గెల్చుకుంది. అంతే కాదు కనీసం మరో పది స్ధానాల్లో మహాకూటమి ఓట్లకు గండికొట్టింది. దీంతో అత్తెసరు మెజారిటీతో ఎన్డీయే కూటమి గట్టెక్కింది. బీహార్ ఫలితాల తర్వాత ఓవైసీ తీరుపై లౌకిక వాదులు మండిపడ్డారు. అయితే ఇంతకాలం మౌనంగా ఉన్న బీజేపీ మాత్రం ఇప్పుడు ఆ విషయం బయటపెట్టేసింది. యూపీలోని ఉన్నవ్ బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ బీహార్లో బీజేపీకి ఓవైసీ సాయం చేశారంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.
ఓవైసీని దేవుడు ఆశీర్వదించాలన్న సాక్షి మహరాజ్
దేవుని దయతో బీహార్ ఎన్నికల్లో బీజేపీకి అసదుద్దీన్ ఓవైసీ సాయం చేశారని, ఆయనకు దేవుడు అండగా నిలవాలని బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ తాజాగా వ్యాఖ్యానించారు. దేవుడి దయతో ఆయన యూపీ పంచాయతీ ఎన్నికల్లోనూ బరిలోకి దిగారని, త్వరలో జరిగే పశ్చిమ బెంగాల్, యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమకు సాయం చేయబోతున్నారని సాక్షి మహరాజ్ బయటపెట్టారు. దీంతో ఓవైసీ ఇరుకునపడినట్లయింది. యూపీ పంచాయతీ ఎన్నికల్లో ఓవైపీ నేతృత్వంలోని ఎంఐఎం.. ఓం ప్రకాష్ రాజ్భర్ నేతృత్వంలోని సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగింది.
బీజేపీ బీ టీమ్ విమర్శలకు బలం
గతంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన ఎంఐఎం బీజేపీకి బీ టీమ్గా విమర్శలు ఎదుర్కొంది. కాంగ్రెస్తో పాటు మహాకూటమి పార్టీలన్నీ ఎంఐఎం తీరుపై దుమ్మెత్తిపోశాయి. అయినా ఇవేవీ లెక్కచేయకుండా పోటీ చేసి ఐదు ముస్లిం ప్రభావిత అసెంబ్లీ స్ధానాలు గెల్చుకుంది. అప్పట్లో బీజేపీ బీ టీమ్ అన్న విమర్శలను తిప్పికొట్టిన అసదుద్దీన్ ఓవైసీ.. ఇప్పుడు ఏకంగా బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ చేసిన వ్యాఖ్యలతో ఇరుకునపడినట్లయింది. ముఖ్యంగా కాంగ్రెస్ వంటి విపక్ష పార్టీలకు వ్యతిరేకంగా పోటీ చేస్తూ ఎంఐఎం ఓట్ల చీలికకు కారణమవుతోందన్న విమర్శలకు సాక్షి మహరాజ్ తాజా వ్యాఖ్యలు బలం చేకూర్చాయి.