అసదుద్దీన్ అనూహ్యం: యూపీలో సమాజ్ వాదీ ఫ్యామిలీతో పొత్తు! -బెంగాల్లో ఐఎస్ఎఫ్తో -25న ఓవైసీ ర్యాలీ
చాలా కాలంపాటు హైదరాబాద్ కు మాత్రమే పరిమితమైన ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) పార్టీ.. 2014 మోదీ ప్రభంజనం తర్వాత క్రమంగా విస్తరిస్తూ, ఇప్పటికే మహారాష్ట్ర, బీహార్ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ విజయాలు సాధించింది. ఇదే ఊపుతో త్వరలో జరుగనున్న పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటుకుంటామని ఆ పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇదివరకే ప్రకటించారు. ఆ మేరకు, యూపీ, బెంగాల్ లో మజ్లిస్ పార్టీకి కచ్చితంగా కలిసొచ్చేలా అసద్ భారీ స్కెచ్ గీస్తున్నారు. అందులో భాగంగానే..
శివపాల్తో ఓవైసీ భేటీ
ఉత్తరప్రదేశ్లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణలు మొదలయ్యాయి. అధికార బీజేపీని దెబ్బ కొట్టేలా మిగతా శక్తులన్నీ ఏకం కావాలన్న డిమాండ్ కు అనుగుణంగా ఈసారి అనూహ్య పొత్తులకు అవకాశం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రగతి శీల్ సమాజ్ వాదీ పార్టీ చీఫ్ శివపాల్ సింగ్ యాదవ్ తో మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ భేటీ అయిన తర్వాత కొత్త పొత్తుల వ్యవహారం చర్చనీయాంశమైంది. ఓవైసీతో భేటీ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శివపాల్.. ''కొత్త పొత్తులకు సమాజ్ వాదీ కుటుంబం సిద్ధం'' అంటూ ఓ హింట్ కూడా వదిలారు. నిజానికి..
పెళ్లి విందులో మంతనాలు
మజ్లిస్ పార్టీ యూపీ శాఖ అధ్యక్షుడు శౌతక్ అలీ కుమార్తె వివాహ వేడుకలో పాల్గొనేందుకుగానూ శనివారం రాత్రి ఆజమ్గఢ్ వచ్చిన అసదుద్దీన్, శివపాల్ యాదవ్ కు ఓ పక్కకు చేరి గంటలపాటు మంతనాలు జరిపారు. యూపీలో సుదీర్ఘ కాలం పాటు పాలన సాగించిన యాదవ్ పరివారంలో ముఖ్యుడైన శివపాల్ సింగ్ యాదవ్.. సమాజ్ వాదీ పార్టీ సుప్రీంనేత ములాయం సింగ్ యాదవ్ కు తోడబుట్టిన సోదరుడన్న సంగతి తెలిసిందే.
ములాయం కొడుకు, ప్రస్తుత ఎస్పీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ సింగ్ యాదవ్ తో విభేదాల కారణంగా శివపాల్.. ప్రగతి శీల్ సమాజ్ వాదీ పేరుతో వేరు కుంపటి కొనసాగిస్తున్నా, ఎన్నికల నాటికి సమాజ్ వాది పరివారం మళ్లీ ఏకమయ్యేలా, బాబాయ్-అబ్బాయిలు కలిసిపోయేలా నేతాజీ ములాయం తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. కాగా,
యాదవ్ ఫ్యామిలీతో ఓవైసీ పొత్తు
2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఎలాగైనా దెబ్బతీయాలంటోన్న శివపాల్ యాదవ్.. కాషాయ దళాన్ని ఓడించేందుకు అన్నిపార్టీల వారూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మజ్లిస్ పార్టీతో పొత్తుకు సిద్ధమేననే సంకేతాలు ఇచ్చారాయన. తమ పార్టీ సమాజ్ వాదీ పార్టీలో విలీనం కాబోదని శివపాల్ చెబుతున్నప్పటికీ, అన్న ములాయంతో ఆయన నిరంతరం టచ్ లో ఉన్నారని, సమయానుకూలంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
ముందుగా అసదుద్దీన్ ఓవైసీతో పొత్తు ఖరారైన తర్వాత పెరిగిన బలంతో శివపాల్ యాదవ్.. ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ తో సీట్ల షేరింగ్ పై చర్చలు జరిపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. యూపీలో పాగా కోసం ప్రయత్నిస్తోన్న ఓవైసీకి.. కేవలం శివపాల్ యాదవ్ పార్టీతో పొత్తు పెట్టుకున్నా, అది సమాజ్ వాదీ పార్టీతో పొత్తుగా మారినా రెండూ కలిసొచ్చే అవకాశాలే. నిజానికి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం.. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీతో కలిసి పోటీచేసింది. మరి శివపాల్ తో ఓవైసీ భేటీని మాయ ఎలా భావిస్తున్నారనేది తెలియాల్సి ఉంది. మరోవైపు..
మజ్లిస్ విద్యార్థి విభాగం ఏర్పాటు..
వచ్చే ఏడాది జరగబోయే యూపీ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలనుకుంటోన్న ఎంఐఎం పార్టీ.. ఓవైపు పొత్తుల చర్చలు చేస్తూనే, సొంతగా తన బేస్ విస్తరించుకునే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో తొలిసారిగా మజ్లిస్ పార్టీ తన విద్యార్థి విభాగాన్ని ఏర్పాటు చేసింది. ప్రతిష్టాత్మక అలహాబాద్ యూనివర్సిటీ(ఏయూ) విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎంఐఎం విద్యార్థి విభాగం బరిలో నిలబడుతుందని ఆ పార్టీ యూపీ చీఫ్ షౌకత్ అలీ ప్రకటించారు.
మజ్లిస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా ఏయూ విద్యార్థి మొహ్మద్ ఆమిర్ పేరును ఖరారు చేశారు. పేరుకు విద్యార్థి సంఘం ఎన్నికలే అయినప్పటికీ, దీనిని ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ఎంఐఎం.. ప్రయాగ్ రాజ్ లో ఇంటింటి ప్రచారాన్ని కూడా మొదలుపెట్టింది. ఇదిలా ఉంటే..
బెంగాల్లో మజ్లిస్ జోరు -25న అసద్ ర్యాలీ
ఈ ఏడాది మేలోగా అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పశ్చిమ బెంగాల్ లో సత్తా చాటుకునే దిశగా ఎంఐఎం కీలక కార్యాచరణ రూపొందించింది. ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ ఫ్యామిలీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోన్న ఓవైసీ.. పశ్చిమ బెంగాల్ లో మాత్రం అబ్బాస్ సిద్దిఖీ ఆధ్వర్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ఐఎస్ఎఫ్)తో పొత్తును దాదాపు ఖరారు చేసుకున్నారు.
దాదాపు రెండు నెలలుగా సాగుతోన్న పొత్తు చర్చలు కొలిక్కి వచ్చాయని తెలుస్తోంది. ఈనెల 25న కోల్ కతాలో నిర్వహించబోయే భారీ ర్యాలీలో మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ దీనిపై ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం. అసదుద్దీన్ బెంగాల్ లో తన తొలి ఎన్నికల ర్యాలీని డైమండ్ హార్బర్(మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ లోక్ సభ స్థానం) నుంచే ప్రారంభిస్తుండటంపై టీఎంసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంఐఎం ముమ్మాటికీ బీజేపీ బీ-టీమే అని సౌగత్ రాయ్ మండిపడ్డారు.