పౌరసత్వ సవరణ చట్టం: సుప్రీంకోర్టును ఆశ్రయించిన అసదుద్దీన్ ఒవైసీ
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ శనివారం ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పౌరసత్వ సవరణ బిల్లు చర్చ సందర్భంగా అసదుద్దీన్ ఒవైసీ ఆ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే.
కీలక బిల్లులకు ఆమోద ముద్ర వేసిన పార్లమెంటు: చట్టంగా మారిన పౌరసత్వ బిల్లు
అంతేగాక, పార్లమెంటులో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ బిల్లు ప్రతులను కూడా చించివేశారు అసదుద్దీన్. లోక్సభలో పౌరసత్వ బిల్లు సందర్భంగా ఒవైసీ మాట్లాడుతూ.. ఈ బిల్లు ద్వారా దేశాన్ని విభజించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఆ తర్వాత సభలోనే బిల్లు ప్రతులను చించివేసి.. ఉద్వేగంతో కంటతడిపెట్టుకున్నారు.
ఈ బిల్లును సవాల్ చేస్తూ ఇప్పటికే పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్, టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రాతోపాటు ఆల్ అస్సాం స్టూడెంట్ యూయిన్(ఆసు), పీఎస్ పార్టీ, కొన్ని ఎన్జీవోలు, న్యాయవాది ఎంఎల్ శర్మతోపాటు పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు.
పౌరసత్వ సవరణ బిల్లుకు సోమవారం లోక్సభ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 311 ఓట్లు రాగా, 80 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. కాగా, ఈ బిల్లుకు బుధవారం రాజ్యసభ ఆమోదించింది. రాజ్యసభలో 120 ఓట్లు అనుకూలంగా రాగా, 105 ఓట్లు వ్యతిరేకంగా పడ్డాయి.
కాగా, పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. అస్సాం, త్రిపురల్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అస్సాంలో భద్రత బలగాలు, నిరసనకారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి.