భారత్.. మరో సిరియా అవుతుందన్న శ్రీశ్రీ రవిశంకర్ కు కమిటీలో స్థానం కల్పించడమా?: ఒవైసీ
హైదరాబాద్: అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదాన్ని పరిష్కరించడానికి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కమిటీలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త పండిట్ శ్రీ శ్రీ రవిశంకర్ ను నియమించడాన్ని తప్పుపడుతున్నారు. గతంలో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యానాలే దీనికి కారణం.
రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఈ ముగ్గురి మీదే: ఎవరు వాళ్లు?
మధ్యవర్తిత్వ కమిటీలో శ్రీ శ్రీ రవిశంకర్ ను నియమించడం సహేతుకం కాదని హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఆయన స్థానంలో తటస్థుడిని నియమించాలని అన్నారు. అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంలో శ్రీశ్రీ రవిశంకర్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ భూమి మొత్తాన్నీ హిందువులకు అప్పగించకపోతే.. భారత్ మరో సిరియాలా మారుతుందని శ్రీశ్రీ రవిశంకర్ హెచ్చరించారు.
రెండేళ్ల కిందట ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తిని మధ్యవర్తిత్వ కమిటీలో నియమించడాన్ని ఒవైసీ తప్పుపట్టారు. రవిశంకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించకపోవచ్చని అన్నారు. ఆయన ఆలోచన విధానం మిగిలిన సభ్యులపై పడుతుందని చెప్పారు. రవిశంకర్ ను తప్పించి, ఆయన స్థానంలో మరో తటస్థుడిని నియమిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
ఈ మధ్యవర్తిత్వ కమిటీలో రవిశంకర్ తో పాటు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఖలీఫుల్లా, న్యాయవాది శ్రీరామ్ పంచు ఉన్నారు. ఈ ముగ్గురు సభ్యుల కమిటీ మధ్యవర్తిత్వాన్ని నిర్వర్తించాల్సి ఉంటుంది. ఉత్తర్ ప్రదేశ్ లోని ఫైజాబాద్ కేంద్రంగా ఈ కమిటీ పనిచేస్తుంది. హిందు, ముస్లిం ప్రతినిధులు, సంఘాల నుంచి అభిప్రాయాలను స్వీకరిస్తుంది. అనంతరం ఓ నివేదికను రూపొందించి, సుప్రీంకోర్టుకు సమర్పిస్తుంది. మొత్తం ఎనిమిది వారాల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.