క్షమాపణ చెప్పాలి: అసద్ డిమాండ్, పత్రికపై ఆగ్రహం
హైదరాబాద్: జమ్మూ అబ్జర్వర్ పత్రికపై మజ్లీస్ అధినేత, పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా మండిపడ్డారు. తన పేరును ఉటంకిస్తూ తనపై జమ్మూ అబ్జర్వర్ దిన పత్రిక రాసిన వార్తలో నిరాధారమని ఆయన అన్నారు.
భారత ముస్లింల గురించి తాను కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు పత్రికలో వచ్చిందని, హిందీ పోస్టర్పై తన చిత్రంతో పాటు తాను కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు వార్తాకథనం ప్రచురితమైందని, ఈ విషయంపై తనను చాలా మీడియా మిత్రులు ప్రశ్నించారని ఆయన అన్నారు.
ఆ కరపత్రంతో తనకు ఏ విధమైన సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. తాను ఏ విధమైన విద్వేషపూరితమైన ప్రకటన చేయలేదని అన్నారు. ఆ విధమైన రెచ్చగొట్టే కరపత్రాన్ని ఎవరు పంపిణీ చేశారో తనకు తెలియదని ఆయన అన్నారు.
జమ్మూ అబ్జర్వర్ పత్రిక తనకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ పత్రికపై తాను న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు.