ఆశారాంపై రేప్ కేసు: ఛార్జీషీటుతో మరిన్ని కష్టాలు
మైనర్ బాలికపై లైంగిక వేధింపులు, అత్యాచారం జరిపిన కేసులో ఆశారాంపై పోలీసులు ఛార్జీ షీటు నమోదు చేశారు. అయితే ఆశారాం మాత్రం బాలికపై ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని చెబుతూనే ఉన్నాడు. అదే సమయంలో ఆశారాం బాపుకు సంబంధించిన ముగ్గురు సహాయకులపై రాజస్థాన్ పోలీసులు ఛార్జీ షీటును దాఖలు చేశారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బాధిత బాలికకు వసతి కల్పించి గురువు ఆశారాం బాపు వద్దకు పంపించడంలో వసతి గృహం నిర్వాహకుడు కీలక పాత్ర పోషించారని పోలీసులు తేల్చారు. ఈ నేరంలో వసతి గృహం నిర్వాహకుడి పేరును కూడా ఛార్జీషీటులో చేర్చినట్లు సమాచారం. 16ఏళ్ల బాధితురాలు, ఆమె తల్లిదండ్రులు చాలా కాలం నుంచి ఆ వసతి గృహంలో ఉంటున్నారని, అయితే ఈ ఏడాదేలోనే ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు.
బాలిక దుష్ట ఆలోచనలను కలిగి ఉందని ఆమెను జోధ్పూర్లోని ఆశారాం బాపు ఆశ్రమానికి తీసుకెళ్లాలని చెప్పినట్లు ఆమె తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. ఆ ఆశ్రమానికి చేరుకున్న బాలికపై ఆశారాం బాపు గంటపాటు లైంగికంగా వేధించి అత్యాచారానికి పాల్పడ్డారు. రెండు రోజుల అనంతరం బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో వారు పోలీసులను ఆశ్రయించారు.
కాగా ఈ ఘటన జరిగిన నెల రోజుల తర్వాత ఆశారాం బాపు మరో లైంగిక వేధింపుల కేసులో చిక్కుకున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్లో ఆశారాం బాపు, ఆయన కుమారుడు నారాయణ్ సాయిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తమపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఇద్దరు సోదరీమణులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై గుజరాత్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.