అత్యాచారం: నేడు తేలనున్న ఆశారాం బాపు భవితవ్యం
న్యూఢిల్లీ: పదహరేళ్ళ బాలికపై ఆశారాం బాపు అత్యాచారం చేశారనే ఆరోపణలపై జోథ్పూర్ కోర్టు బుధవారం నాడు తీర్పును వెలువర్చనుంది. ఈ తీర్పును పురస్కరించుకొని దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
రాజస్థాన్, గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అదనపు భద్రతా బలగాలను మోహరించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది.ఈ మేరకు ఆయా రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. షాజహాన్ పూర్ లోని మనాయి ఆశ్రమంలో 2013లో ఆశారాం పదహారేళ్ల బాలికపై అత్యాచారం చేశాడని నమోదైన కేసులో కోర్టు విచారించింది.
నిందితుడైన ఆశారాం జోధ్ పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు. అత్యాచార బాధితురాలి ఇంటి వద్ద కూడా సెక్యూరిటీని నియమించారు. ఆశారాం కేసులో తీర్పు వెలువడిన అనంతరం ఆయన భక్తులు ఎలాంటి ఆందోళన చేయకుండా ముందుజాగ్రత్తగా నాలుగు రాష్ట్రాల్లో అదనపు సాయుధ బలగాలను ఏర్పాటు చేశారు. నాలుగు రాష్ట్రాల్లో కేంద్రం రెడ్ అలర్ట్ ప్రకటించింది.