కొడుకులు తప్ప ఆ ఇద్దరి ముఖాలు ఎక్కడ.. కనిపిస్తే అంతే సంగతి... లాలూ ఫ్యామిలీపై వ్యక్తిగత దాడి...
బీహార్ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్ది వ్యక్తిగత విమర్శల దాడి ఎక్కువవుతోంది. ముఖ్యంగా నితీశ్ వైపు నుంచి లాలూ ఫ్యామిలీపై విమర్శల దాడి తీవ్రమైంది. ప్రతీ ఎన్నికల ర్యాలీలోనూ నితీశ్ తేజస్వి ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా తేజస్వి సోదరుడు తేజ్ ప్రతాప్ సొంత నియోజకవర్గం హసన్పూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో నితీశ్ అండ్ కో లాలూ ఫ్యామిలీని మరోసారి టార్గెట్ చేశారు. ఆర్జేడీ ఎన్నికల క్యాంపెయిన్లో లాలూ,రబ్రీదేవీల ముఖాలు ఎక్కడా కనిపించట్లేదని... ఎందుకంటే వాళ్ల కొడుకులే తమ తల్లిదండ్రులను సిగ్గుచేటుగా భావిస్తారని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సచిన్-సెహ్వాగ్ జోడీలా నితీశ్-మోదీ - చైనా సరిహద్దులో బీహార్ సైనికుల ప్రాణత్యాగం: రాజ్నాథ్
ఇద్దరూ చెరో ఏడేళ్లు సీఎంలు.. అయినా...
హసన్పూర్ ఎన్నికల ర్యాలీలో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ... 'నేను పాట్నాలో ఆర్జేడీ కార్యాలయం మీదుగా వెళ్తున్నప్పుడు... అక్కడ లాలూ చిన్న కొడుకు ఫోటోలు పెద్ద పెద్ద హోర్డింగుల్లో దర్శనమిచ్చాయి. ఆశ్చర్యంగా అతని తల్లిదండ్రుల ఫోటోలేవీ అక్కడి హోర్డింగుల్లో కనిపించలేదు. ఏడేళ్లు అతని తండ్రి ముఖ్యమంత్రిగా పనిచేశాడు.. మరో ఏడేళ్లు ఆమె తల్లి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయినా వాళ్ల ఫోటోలు ఎక్కడా కనిపించట్లేదంటే... వాళ్ల ముఖాలు ఎన్నికల క్యాంపెయిన్లో కనిపించడం సిగ్గుచేటుగా భావిస్తున్నారా..?' అని రవిశంకర్ ప్రసాద్ తేజస్వి యాదవ్ను ప్రశ్నించారు.
వాళ్ల ముఖాలు కనిపిస్తే...
ఇక్కడినుంచి పోటీ చేసేందుకు ఓ వారసుడు రంగంలోకి దిగాడు. రాజ్ కుమార్ రాయ్(సిట్టింగ్ ఎమ్మెల్యే)ని అడిగాను ఇక్కడి నుంచి పాట్నా చేరేందుకు ఎంత సమయం పడుతుందని. రెండున్నర గంటల నుంచి మూడు గంటలు పడుతుందని చెప్పాడు. ఆ వారసుడి తల్లిదండ్రుల పాలనలో ఇక్కడి నుంచి పాట్నా చేరేందుకు 8 గంటలు పడుతుందో,9 గంటలు పడుతుందో... అసలెంత సమయం పడుతుందో ఎవరికీ తెలిసేది కాదు. అప్పటి పరిస్థితులు అలా ఉండేవి.' అని రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. 'వాళ్లకు బాగా తెలుసు... ఒకవేళ తమ తల్లిదండ్రుల ముఖాలు ఎన్నికల క్యాంపెయిన్లో కనిపిస్తే... జనం అప్పటి దుర్మార్గపు పాలన గురించి మాట్లాడుకుంటారు. కిడ్నాప్స్,దొంగతనాలు,శాంతిభద్రతలు తదితర అంశాలన్నీ చర్చకు వస్తాయి. కాబట్టే వాళ్ల కుమారులు లాలూ దంపతుల ముఖాలను ఎన్నికల క్యాంపెయిన్లో ఎక్కడా కనిపించకుండా జాగ్రత్తపడుతున్నారు.' అంటూ వ్యాఖ్యానించారు.
తేజ్ ప్రతాప్ వివాహంపై నితీశ్...
అనంతరం ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. 'దిగ్గజ నేత,మాజీ ముఖ్యమంత్రి దరోగా ప్రసాద్ రాయ్ మనవరాలి పట్ల లాలూ ఫ్యామిలీ ఎలా వ్యవహరించిందో మీకందరికీ తెలుసు.' అని గుర్తుచేశారు. లాలూ పెద్ద కుమారుడు,మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్తో చంద్రికా రాయ్ కుమార్తె ఐశ్వర్య రాయ్ వివాహం జరగడం... ఆ తర్వాత ఆమె నుంచి తేజ్ ప్రతాప్ విడాకులు కోరడం తెలిసిందే. ఆ పరిణామాలతో చంద్రికా రాయ్ జేడీయూలో చేరారు. చంద్రికా రాయ్ సోదరుడు రాజ్ కుమార్ రాయ్ సిట్టింగ్ స్థానమైన హసన్పూర్ నుంచి తేజ్ ప్రతాప్ పోటీ చేస్తున్న నేపథ్యంలో నితీశ్ అండ్ కో ఆయనపై వ్యక్తిగత విమర్శలకు దిగింది.
Recommended Video
రాజ్ కుమార్ రాయ్ వర్సెస్ తేజ్ ప్రతాప్...
2015 అసెంబ్లీ ఎన్నికల్లో మహువా నియోజకవర్గం నుంచి గెలుపొందిన తేజ్ ప్రతాప్... ఈసారి మాత్రం హసన్పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ యాదవులు,ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉండటం... అన్ని విధాలా తన గెలుపుకు సేఫ్ అని భావించి తేజ్ ప్రతాప్ ఇక్కడి నంచి బరిలో దిగుతున్నట్లు చెప్తున్నారు. మరోవైపు జేడీయూ తరుపున సిట్టింగ్ ఎమ్మెల్యే రాజ్ కుమార్ రాయ్ ఇక్కడినుంచి బరిలో ఉన్నారు. ఈ ఇద్దరిలో జనం ఈసారి ఎవరిని గెలిపించబోతున్నారన్నది ఉత్కంఠను రేకెత్తిస్తోంది.