రాజస్థాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్!: 2019 లోకసభ ఎన్నికల్లో సచిన్ పైలట్ దెబ్బపడేనా?
జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అభ్యర్థిని దాదాపుగా ఖరారు చేశారని తెలుస్తోంది. సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖరారు చేసిందని సమాచారం. కాసేపట్లో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో విజయం సాధించింది.
బీజేపీలో కలవరం: మూడు రాష్ట్రాల్లో ఎక్కడ నష్టపోయిందంటే?.. నిపుణుల మాట
అయితే ముఖ్యమంత్రి అభ్యర్థి ఖరారు కాంగ్రెస్ పార్టీ తల ప్రాణం తోకకు వస్తోంది. మధ్యప్రదేశ్లో కమల్ నాథ్, జ్యోతిరాదిత్య సింధియా, రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్లు రేసులో ఉన్నారు. వీరితో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. రాజస్థాన్ విషయంలో దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
లెక్కలు చూసుకొని గెహ్లాట్ పేరు
2019లో లోకసభ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ లెక్కలను పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. ఈ లెక్కలు చూసుకొని అశోక్ గెహ్లాట్ పేరును ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. సీఎం రేసులో ఉన్న సచిన్ పైలట్, అశోక్ గెహ్లాట్ గురువారంఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. వీరిలో సీఎం ఎవరనే విషయంపై రాహుల్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే వారి సమావేశం ముగిసిన వెంటనే అశోక్ గెహ్లాట్ సీఎం అని సమాచారమందినట్లుగా తెలుస్తోంది.
రెండుసార్లు రాజస్థాన్ సీఎంగా చేశారు
67 ఏళ్ల అశోక్ గెహ్లాట్ రెండు సార్లు రాజస్థాన్ ముఖ్యంత్రిగా పని చేశారు. తాజాగా వెలువడిన రాజస్థాన్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 99 చోట్ల, దాని మిత్రపక్షం ఆర్ఎల్డీ ఒకచోట విజయం సాధించాయి. ఈ రెండింటి కూటమితో వంద స్థానాల మెజార్టీని దక్కించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఇక్కడ బీజేపీ 73 సీట్లలో గెలిచింది. ప్రభుత్వం ఏర్పాటు చేసే కాంగ్రెస్కు సీఎం ఎవరనే దానిపై సందిగ్ధత నెలకొంది.
సచిన్ పైలట్ ఆశలు
రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్గా పనిచేసిన సచిన్ పైలట్ కూడా ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరువురితో మాట్లాడిన రాహుల్ గాంధీ.. అశోక్ గెహ్లాట్ను ఎంచుకున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా త్వరలో లోకసభ ఎన్నికలు కూడా ఉన్నందున రాహుల్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో ఆయన ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తల అభిప్రాయం కూడా తీసుకున్నారు.
ఇద్దరి నేతల సామాజిక వర్గం ఎక్కువే
రాజస్థాన్లో ఇద్దరు కూడా గట్టి లీడర్లు. అయితే గెహ్లాట్, సచిన్ సామాజిక వర్గాలు, 2019కి ఆయా వర్గాల మద్దతు తదితరాలను పరిగణలోకి తీసుకొని గెహ్లాట్ పేరును ఖరారు చేశారని తెలుస్తోంది. గెహ్లాట్ రెండుసార్లు రాజస్థాన్ సీఎంగా చేశారు. సచిన్ పైలట్ రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. అశోక్ గెహ్లాట్ మాలి (గార్డెనర్) కమ్యూనిటీకి చెందిన వారు. వీరి సంఖ్య రాజస్థాన్లో ఎక్కువే. గెహ్లాట్ చాలా సీనియర్ కాంగ్రెస్ నేత. అలాగే గాంధీ కుటుంబానికి దగ్గర. ఇక సచిన్ పైలట్ గుజ్జర్ సామాజిక వర్గం నేత. యువకుడు. ఈ కమ్యూనిటీ ఎక్కువగానే ఉంది. సచిన్ పైలట్ను కనుక సీఎంగా చేయకుంటే 2019లో గుజ్జర్లు కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు అండగా ఉంటారనేది ఆసక్తికరమే. ఈ దెబ్బ 2019కి ఉంటుందని అంటున్నారు.