సోనియాకి అహ్మద్ పటేల్లా: రాహుల్ వెనకుండి నడిపించేది ఈయనే, ‘కాంగ్రెస్ చాణక్యుడు’
Recommended Video
న్యూఢిల్లీ/గాంధీనగర్: కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అధికార పక్షంపై విమర్శలు గుప్పిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. గుజరాత్కు బీజేపీ ఏం చేసిందంటూ ప్రజల్లోకి వెళ్లారు.
గుజరాత్ గెలుపు లక్ష్యంగా ప్రచారం నిర్వహించారు. ఆ ఫలితంగానే బీజేపీకి ధీటుగా కాంగ్రెస్ నిలబడగలిగింది. అసలు బీజేపీకి పోటీ ఇస్తుందా? అనే సందేహం నుంచి కాంగ్రెస్సే గెలుస్తుందేమో అని స్థాయికి తీసుకొచ్చారు.
మూడో తరంతో గెహ్లాట్
గాంధీ-నెహ్రూ ఫ్యామిలీలో ప్రస్తుతం మూడోతరంతో అశోక్ గెహ్లాట్ పనిచేస్తుండటం గమనార్హం. నాటి ప్రధాని ఇందిరాగాంధీ హయాంలోనే ఆయన సివిల్ ఏవియేషన్, టూరిజం డిప్యూటీ యూనియన్ మినిస్టర్గా బాధ్యతలు నిర్వహించారు. అప్పటినుంచి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎంతో నమ్మకంగా మారారు. ఆ తర్వాత రాజీవ్, సోనియా గాంధీలకు కూడా సన్నిహితుడిగానే ఉన్నారు ఈ రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి.
రాహుల్ వెనకుండి..
ఇప్పుడు కొత్తగా అధ్యక్ష బాధ్యత చేపట్టిన రాహుల్ గాంధీకి కూడా అశోక్ గెహ్లాట్ సన్నిహితుడిగా, వెనకుండి నడిపించే నేతగా కొనసాగుతున్నారు. గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి నుంచి బలోపేతం కావడానికి రాహుల్ గాంధీ కంటే కూడా గెహ్లాట్ పాత్ర కీలకమని చెప్పవచ్చు. అయితే, కాంగ్రెస్ పార్టీకి రాహుల్ ప్రచారం మరింత బలాన్ని చేకూర్చిందనడంలో అతిశయోక్తి లేదు. ప్రధాని నరేంద్ర మోడీకి ధీటుగా రాహుల్ తన ప్రచారాన్ని కొనసాగించడం గమనార్హం.
రాహుల్ తర్వాతి స్థానం ఆయనదే
కాగా, రాహుల్ గాంధీ వేసే ప్రతి అడుగులో కూడా గెహ్లాట్ పాత్ర ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు, విశ్లేషకులు చెబుతున్నారు. రాహుల్ గాంధీకి నీడలా ఉంటున్నారని అంటున్నారు. అంతేగాక, రాహుల్ గాంధీ తర్వాత కాంగ్రెస్ పార్టీలో నెం.2 స్థానం కూడా గెహ్లాట్దేనని ఆ పార్టీ వర్గాలే చెప్పుకుంటుండటం గమనార్హం. కాంగ్రెస్ సీనియర్ నేతలైన గులాంనబీ అజాద్, ఆనంద్ శర్మ, ఇతర నేతలుప్రచారం చేసినప్పటికీ గెహ్లాట్దే కీలక పాత్ర అని వారంటున్నారు.
ఫలితాలతో సంబంధం లేకుండా జాతీయ నేతగా
గుజరాత్ రాష్ట్రంలో పునాదులు కదిలిపోయిన కాంగ్రెస్ పార్టీకి తిరిగి జీవం పోసిన వారిలో గెహ్లాట్ కీలకంగా నిలిచారు. ఇప్పుడు ఆయన జాతీయ నేతగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కూడా అశోక్ గెహ్లాట్ సేవలను ప్రధానంగా ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తుండటం గమనార్హం.
సోనియాకు అహ్మద్ పటేల్.. రాహుల్కి గెహ్లాట్
అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తారని ఆ పార్టీ నేతలు గుజరాత్ ఎన్నికల ఫలితాలకు ముందే చర్చించుకుంటున్నారు. సోనియా గాంధీకి అహ్మద్ పటేల్ ఎలా కీలకంగా ఉన్నారో.. ఇప్పుడు రాహుల్ గాంధీకి అశోక్ గెహ్లాట్ అలానే ఉండనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, అహ్మద్ పటేల్లా పార్టీకి ఆయన నిధులు సేకరించలేరని మరికొందరు అంటున్నారు.
ఆ ముగ్గురి మద్దతు కూడగట్టడంలో కీలకం
గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలుపుముందట నిలిపడటంతో అశోక్ గెహ్లాట్ సత్తా ఏమిటో పార్టీ పెద్దలకు తెలిసిందని చెబుతున్నారు. హార్దిక్ పటేల్, జిగ్నేష్ మేవానీ, అల్పేష్ ఠాకూర్లను కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికేలా చేయడంలో గెహ్లాట్ కీలక పాత్ర పోషించారని అంటున్నారు. ఇప్పుడు అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ పార్టీకి చాణక్యుడు అని ప్రశంసలు గుప్పిస్తుండటం గమనార్హం.
రాజస్థాన్ ఎన్నికల్లో కూడా..
ఈ నేపథ్యంలో అశోక్ గెహ్లాట్ రాష్ట్రస్థాయి రాజకీయాల్లో కాకుండా జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి బలంగా మారిపోయారు. ఇక రాజస్థాన్ ఎన్నికల్లో కూడా గెహ్లాట్ ప్రధాన పాత్ర పోషిస్తారని కాంగ్రెస్ భావిస్తోంది. త్వరలో రానున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ పంపిణీలో గెహ్లాట్ నిర్ణయమే కీలకం కానుంది. ఆ తర్వాత సచిన్ పైలట్ సేవలను కూడా పార్టీ వినియోగించుకోనుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
గెహ్లాట్ ప్రభావం..
సచిన్ పైలట్ కంటే కూడా అశోక్ గెహ్లాట్ అత్యంత ప్రభావితం చేయగల నేత అని సీఎం వసుంధర రాజే కూడా భావిస్తోందని వారంటున్నారు. కాగా, సచిన్ పైలట్ బీజేపీకి ఏమాత్రం పోటీ ఇవ్వలేరని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. సచిన్ పైలట్ సీఎం రాజేపై పోటీ చేసినా గెలుపొందే అవకాశాలు మాత్రం లేవని స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఎత్తుగడలు వేసినా.. రాజస్థాన్ రాష్ట్రంలో మరోసారి బీజేపీ విజయం ఖాయమని చెబుతున్నారు.