సచిన్ సంచలనం: ఏడాది నుంచి వేధింపులు, గెహ్లట్ చెప్పుచేతల్లో బ్యూరోక్రాట్లు, పంపని ఫైల్స్, నో సీఎల్పీ
కాంగ్రెస్ రెబల్ సచిన్ పైలట్ ఎట్టకేలకు నోరువిప్పారు. గత ఏడాది నుంచి అశోక్ గెహ్లట్ అండ్ కో నుంచి ఇబ్బందులను ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ తప్పుకున్నాక తనను లక్ష్యం చేసుకున్నారని వివరించారు. ఇండియా టు డే మ్యాగజైన్ ప్రతినిధితో ఏడాదిలో జరిగిన పరిణామాలు, అవమానాలను వివరించారు. తనకు జరుగుతోన్న అన్యాయాన్ని హై కమాండ్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు అని వాపోయారు. చివరికీ తన వర్గంతో పోరాడితే.. వేటు వేశారని తెలిపారు. ఏడాదిలో అశోక్ గెహ్లట్, బృందం తన కాళ్లను బంధించారని పేర్కొన్నారు.
నిశ్శబ్దాన్ని వీడనున్న సచిన్: కొత్త పార్టీ?: కాంగ్రెస్కు నిద్రలేకుండా: ఆ కమ్యూనిటీ ఓటుబ్యాంకు
రాహుల్ రాజీనామా తర్వాత..?
గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవీకి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అప్పటివరకు తనను ఏమీ అనని గెహ్లట్ టీం.. తర్వాత వేధించడం ప్రారంభించిందని పైలట్ వెల్లడించారు. ఏఐసీసీ కోటరి చుట్టూ గెహ్లట్ టీం చేరి.. తన ఆత్మగౌరవం దెబ్బతీసే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. అయినప్పటికీ గెహ్లట్పై తాను కోపం తెచ్చుకోలేదని చెప్పారు. తనకు ప్రత్యేక అధికారాలు, గౌరవం కావాలని కోరలేదని చెప్పారు. కానీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చడం సాధ్యం కాలేదన్నారు.
పనిచేయనివ్వడం లేదు..
రాజస్తాన్ అభివృద్ది కోసం తనను గౌరవంగా గెహ్లట్ పనిచేయనీయలేదు అని పైలట్ మండిపడ్డారు. తన మాటను ఐఏఎస్లు వినకుండా చేశారని వాపోయారు. తన సొంత శాఖకు సంబంధించి ఫైళ్లు కూడా తన వద్దకు వచ్చేవి కాదన్నారు. మంత్రివర్గం సమావేశం, సీఎల్పీ మీటింగ్ నెలలుగా జరగకపోవడంలో అర్థమేంటీ అని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పనిచేయకుంటే ఏం లాభం అని ప్రశ్నించారు.
ఆత్మగౌరవం దెబ్బతింది: పైలట్
ఈ నెల 13వ తేదీన జరిగిన సీఎల్పీ సమావేశానికి హాజరై సమస్యను ప్రస్తావించొచ్చు కదా అని అడిగితే.. అప్పటికే తన ఆత్మగౌరవం దెబ్బతిందని సచిన్ పైలట్ పేర్కొన్నారు. తనపై దేశద్రోహ ఆరోపణలతో నోటీసులు పంపించారని వాపోయారు. ఇక్కడే కాదు ఎక్కడైనా సొంత మంత్రికి ఇలా నోటీసులు పంపించారా అని అడిగారు. అయితే సీఎల్పీ భేటీ పార్టీ కార్యాలయంలో జరగాలి కదా.. సీఎం నివాసంలో జరగడం ఏంటీ అని ప్రశ్నించారు. బీజేపీలో చేరేందుకు ప్రయత్నించారని ఓం మాథూర్, సింధియా భేటీ అయ్యారని ప్రశ్నిస్తే.. ఏ బీజేపీ నేతతో తాను కలువలేదు అని చెప్పారు. గత ఆరునెలలుగా సింధియాతో సమావేశం కాలేదని స్పష్టంచేశారు.
ప్రియాంక ఫోన్ చేశారు
సమస్యను సోనియా, రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లలేదు అని.. ప్రియాంక గాంధీ మాత్రం తనతో ఫోన్లో మాట్లాడారని పైలట్ తెలిపారు. కానీ సమస్యకు పరిస్కారం కాదని.. వ్యక్తిగత విషయాలపై మాట్లాడారని వివరించారు. కాంగ్రెస్ పార్టీకి తన డిమాండ్ ఏమీ లేదు అని.. ఆత్మగౌరవంతో పనిచేసేందుకు అవకాశం కల్పించాలని కోరానని చెప్పారు. అదీ లేకపోవడంతో తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి మంతనాలు జరుపుతున్నానని వివరించారు. పార్టీ తన డిప్యూటీ సీఎం, పార్టీ చీఫ్ పదవీ నుంచి తప్పించిన.. ఇప్పటికీ తాను కాంగ్రెస్ వ్యక్తినేనని ఇంటర్వ్యూ సమయంలో పైలట్ పేర్కొన్నారు.
ఎవరికీ చెప్పిన ఫలితం లేదు..
రాజస్తాన్ ప్రభుత్వంలో, పార్టీ పరంగా జరుగుతున్న ఇబ్బందులను గెహ్లట్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. రాజస్తాన్ కాంగ్రెస్ ఇంచార్జీ, ఇతర నేతలతో కూడా మాట్లాడానని గుర్తుచేశారు. కానీ ప్రయోజనం లేదు అని గుర్తుచేశారు. బీజేపలో చేరబోతున్నారా అని ప్రశ్నిస్తే.. రాష్ట్రంలో బీజేపీపై వ్యతిరేకంగా పోరాడి.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది తానేనని గుర్తుచేశారు. అలాంటప్పుడు తిరిగి బీజేపీలోకి ఎలా వెళతానని ప్రశ్నించారు. తన సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉంటే.. ఇక మిగతా పార్టీలో తనను ఎలా చూస్తారు అని సందేహాం వ్యక్తం చేశారు.
Recommended Video
గెహ్లట్కు పగ్గాలు..
బీజేపీలో చేరడం లేదు అని, కానీ కొందరు ప్రచారం చేస్తున్నారని సచిన్ పైలట్ మండిపడ్డారు. బీజేపీలో చేరడం అనే ప్రశ్నే లేదని తేల్చిచెప్పారు. ఇంత జరుగుతున్న తాను పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదు అని, కామెంట్ కూడా చేయలేదన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సచిన్ పైలట్ను డిప్యూటీ సీఎం పదవీ నుంచి కాంగ్రెస్ పార్టీ తప్పించిన సంగతి తెలిసిందే. అతని మద్దతుదారులు విశ్వేంద్ర సింగ్, రమేశ్ మీనా మంత్రి పదవులను తొలగించింది. వాస్తవానికి 2018లో రాజస్తాన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం సచిన్ పైలట్. పీసీసీ చీఫ్గా ప్రజలతో మమేకమై.. అధికార పార్టీ తప్పులను ఎత్తి చూపి ముందడుగు వేశారు. కానీ హై కమాండ్ మాత్రం గెహ్లట్ వైపు మొగ్గుచూపి.. సీఎం పదవీ కట్టబెట్టారు. దీంతో సచిన్ సహా అనుచరులు తీవ్ర నిరాశతో ఉన్నారు.