గుజ్జర్ల రిజర్వేషన్ బిల్లుకు రాజస్థాన్ అసెంబ్లీ ఆమోదం .. బంతి కేంద్రం పరిధిలో ఉందన్న పైలట్
జైపూర్ : విద్య, ఉద్యోగాల్లో తమకు రిజర్వేషన్ కల్పించాలని ఆందోళన చేస్తున్న గుజ్జర్ల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. గుజ్జర్ల రిజర్వేషన్ కు రాజస్థాన్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో రిజర్వేషన్ల ప్రక్రియలో ఒక అడుగు ముందుకుపడింది. ఇక పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఆమోదిస్తే గుజ్జర్ల రిజర్వేషన్ అమలవుతోంది.
12 ఏళ్లుగా ఆందోళన
తమకు రిజర్వేషన్ కల్పించాలని దాదాపు 12 ఏళ్లుగా గుజ్జర్లు ఆందోళన చేస్తున్నారు. దానిని వారం క్రితం మరింత తీవ్రతరం చేశారు. రోడ్లపై వాహనాలను, పట్టాలపై రైళ్లను అడ్డుకొని నిరసనను తీవ్రతరం చేయడంతో రాజస్థాన్ ప్రభుత్వం దిగొచ్చింది. గుజ్జర్లకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బుధవారం బిల్లు తీసుకొచ్చింది. ఈ బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
వాట్ నెక్ట్స్ ..?
గుజ్జర్ల ఆందోళనతో రాజస్థాన్ ప్రభుత్వం దిగొచ్చింది. రిజర్వేషన్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. తర్వాత ఏంటి అని ప్రశ్నిస్తే .. బంతి కేంద్రం పరిధిలోకి వెళ్లిందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ బదులిచ్చారు. గుజ్జర్ల రిజర్వేషన్ బిల్లుకు రాజ్యాంగ సవరణ చేశాకే చట్టబద్ధత వస్తోందని చెప్పారు. తమ పరిధిలో బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపించామని స్పష్టంచేశారు.
రిజర్వేషన్ కల్పించే వీలుందా ?
కేంద్రం, రాష్ట్రాల్లో రిజర్వేషన్ పరిధి 50 శాతం మించి ఉండకూడదనే సుప్రీంకోర్టు నిబంధన ఉంది. దీనిని అనుసరించి .. రిజర్వేషన్లను అమలు చేస్తారు. అయితే తమిళనాడు, మహారాష్ట్ర సహా రాజస్థాన్ లో ఇప్పటికే రిజర్వేషన్ల శాతం 50 శాతం మించి ఉంది. అయితే ఇటీవల కేంద్రం వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకొచ్చిన విషయాన్ని సచిన్ పైలట్ గుర్తుచేశారు. గుజ్జర్ల రిజర్వేషన్ బిల్లుకు రాజ్యాంగ సవరణ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని మరోసారి నొక్కి చెప్పారు. ఇదే అంశంపై బీజేపీ చీఫ్ అమిత్ షాను కలిసి విన్నవిస్తామన్నారు.
అప్పుడు ఎందుకు గుజ్జర్ల కోసం బిల్లు పెట్టలేదు
గుజ్జర్లకు రిజర్వేషన్ కల్పిస్తామని ప్రచారం చేసి ఇదివరకు అధికారంలోకి వచ్చిన వసుంధర రాజే .. హామీలను విస్మరించారని మండిపడ్డారు పైలట్. గత ప్రభుత్వం గుజ్జర్ల డిమాండ్లను పెడచెవిన పెట్టిందని మండిపడ్డారు. గుజ్జర్లను ఎస్టీలో చేరుస్తామని .. ఆ మాటే వసుంధర రాజే మరిచారని విమర్శించారు. ఆ తర్వాత చాలా చర్చల తర్వాత ఐదు సంచార జాతులకు 5 శాతం రిజర్వేషన్ ను రాష్ట్రంలో కల్పించారని పేర్కొన్నారు. అయితే '5 శాతం రిజర్వేషన్ అనే అంశం ఇదివరకే రాజస్థాన్ లో ఉన్నది. ఆ రిజర్వేషన్ వేరు .. ప్రస్తుత గుజ్జర్ల కోసం ప్రవేశపెట్టిన బిల్లు వేరు‘ అని అన్నారు ఫైలట్. రిజర్వేషన్లకు సంబంధించి కేంద్రం కూడా 50 శాతం పరిధి దాటిందనే అంశాన్ని ప్రత్యేకంగా గుర్తుచేశారు ఫైలట్.